అల‌ర్ట్.. క‌రోనాకు రెండు కొత్త ల‌క్ష‌ణాలు

జ‌లుబు.. పొడి ద‌గ్గు.. జ్వ‌రం.. క‌రోనా వైర‌స్ సోకిన రోగిలో ప్ర‌ధానంగా క‌నిపించే అక్ష‌ణాలివి. ఇవి కాక ఒళ్లు నొప్పులు, కళ్లు ఎర్రబారడం, అలసట, శ్వాస తీసుకోలేకపోవడం, గొంతునొప్పి, విరేచనాలు లాంటి ల‌క్ష‌ణ‌లు కూడా కొంద‌రు క‌రోనా రోగుల్లో క‌నిపిస్తాయ‌ని వైద్యులంటున్నారు. ఆ మ‌ధ్య ఇవి కాక కాలి వేళ్ల రంగు మార‌డం కూడా క‌రోనా ల‌క్ష‌ణ‌మంటూ ఒక అప్ డేట్ వ‌చ్చింది. కానీ అలా అరుదుగానే జ‌రుగుతుంద‌ని తేలింది. ఐతే ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం అధికారికంగా రెండు కొత్త క‌రోనా ల‌క్ష‌ణాల్ని ధ్రువీక‌రిస్తూ జ‌నాల్ని అలెర్ట్ చేసింది. అకస్మాత్తుగా రుచి, వాసన చూసే శక్తిని కోల్పోతే అది కరోనా కావొచ్చని కేంద్రం ప్ర‌క‌టించింది.

ఉన్నట్టుండి వాసన, రుచి చూసే శక్తి కోల్పోవడాన్ని కూడా క‌రోనా ల‌క్ష‌ణంగా పేర్కంటూ ‘క్లినికల్ మేనేజ్ మెంట్ ప్రోటోకాల్: కొవిడ్-19’ అనే ప్రత్యేక డాక్యుమెంట్లో ప్ర‌భుత్వ అధికార వ‌ర్గాలు ప్రచురించాయి. ఈ ప్రత్యేక పత్రాన్ని దేశవ్యాప్తంగా వైద్య నిపుణుల సందేహ నివృత్తి కోసం అందించనున్నారు. వాసనలు గుర్తించడంలో విఫలం కావడం, రుచిని తెలుసుకోలేకపోవడం కూడా కరోనా వైరస్ కారణంగా కలిగే లక్షణాలుగా ఇటీవ‌ల ప‌రిశీల‌న‌లో తేలిన‌ట్లు కేంద్రం తెలిపింది. ఇక కరోనా వ్యక్తి నుంచి వ్యక్తికి నేరుగా ఎలా సోకుతుందో కూడా ఈ డాక్యుమెంట్ లో నిర్వచించారు. ఓ వ్యక్తితో సన్నిహితంగా మెలగడం, ప్రధానంగా ముక్కు, నోటి నుంచి పడే తుంపర్లతో వైరస్ వ్యాపిస్తుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా, కరోనా సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా అతడి ముక్కు, నోటి నుంచి పడే తుంపర్లు ఏదైనా ప్రదేశంపై పడితే, ఆ ప్రదేశాన్ని ఎవరైనా తాకి, ఆ చేతిని కళ్ల వద్ద, ముక్కు, నోటి వద్ద తాకించినా కరోనా సోకుతుందని వివరించారు.