పార్లమెంట్ లో మళ్లీ మంటలు తప్పవా ?

పార్లమెంటులో మళ్ళీ మంటలు తప్పేట్లు లేదు. అప్పుడెప్పుడో పార్లమెంటు సమావేశాల ముందు కరెక్టుగా పెగాసస్ స్పై వేర్ మంటలు మండిపోయాయి. దేశంలోని వివిధ రంగాల్లోని ప్రముఖుల మొబైల్ ఫోన్లను కేంద్ర ప్రభుత్వం పెగాసస్ అనే  స్పైవేర్ ద్వారా ట్యాప్ చేసిందనే ‘ది వైర్’ కథనం పార్లమెంటును ఒక ఊపు ఊపేసింది. మొత్తం ప్రతిపక్షాలన్నీ నరేంద్ర మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా ఏకమయ్యాయి. దాంతో పార్లమెంటు సమావేశాలు రచ్చ రచ్చయిపోయాయి.

పెగాసస్ స్పైవేర్ ఆరోపణల నుంచి బయటపడేందుకు మోడీ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కేంద్రం సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణి అవలంభించటంతో స్పైవేర్ ఉపయోగించింది వాస్తవమే అని అందరికీ అర్ధమైపోయింది. చివరకు సుప్రీంకోర్టు సూమోటోగా పెగాసస్ వివాదంపై విచారణ మొదలు పెట్టింది. అంతకుముందే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వేసిన విచారణ కమిటీని సుప్రీంకోర్టు నిలిపేసింది. కేసు విచారణ సందర్భంగా చివరకు సుప్రీంకోర్టుకు కూడా కేంద్రం సరైన సమాధానాలు చెప్పలేదు.

సరే కోర్టులో విచారణ జరుగుతోంది కదాని ప్రతిపక్షాలు ఓపిగ్గా ఉన్నాయి. 31వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవబోతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే శనివారం నాడు పెగాసస్ స్పైవేర్ ను భారత్ కొనుగోలు చేసింది వాస్తవమే అనే కథనం దేశంలో మళ్ళీ సంచలనంగా మారింది. తాజా కథనాన్ని ప్రచురించింది ప్రముఖ అంతర్జాతీయ మీడియా న్యూయార్క్ టైమ్స్ కావటం గమనార్హం. పెగాసస్ స్పైవేర్ ను ఇజ్రాయెల్ నుండి భారత్ 2017లోనే కొన్నదట. 

భారత్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన రక్షణ పరికరాల కొనుగోలులో భాగంగానే పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కూడా భారత్ కొన్నట్లు న్యూయార్క్ టైమ్స వివరంగా పెద్ద కథనాన్ని అచ్చేసింది. ఈ స్పైవేర్ ఆధారంగానే  రాహుల్ గాంధీ లాంటి ప్రముఖ రాజకీయ నేతలతో పాటు జడ్జీలు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, శాస్త్రజ్ఞులు, మీడియా ప్రముఖులు, సెలబ్రిటీలు సుమారు 300 మంది మొబైల్ ఫోన్లను కేంద్రం ట్యాపింగ్ చేస్తోందంటూ అప్పట్లో మంటలు మండాయి. ఇపుడు కూడా బడ్జెట్ సమావేశాలు మొదలయ్యే ముందు మళ్ళీ అలాంటి కథనమే మరికొంత ఆధారాలతో సహా రావడం మోడీకి తలనొప్పి తెస్తుందనటంలో సందేహం లేదు.