బూమ‌రాంగ్ కానున్న కేసీఆర్ నిర్ణ‌యం!

సీఎం కేసీఆర్ తీసుకున్న ఒక నిర్ణ‌యం భ‌విష్య‌త్ లో బూమ‌రాంగ్ అవ‌నుందా..? జిల్లాల‌కు కొత్త అధ్య‌క్షుల నియామ‌కంలో ఆయ‌న అవ‌లంబించిన వైఖ‌రి స‌రైన‌ది కాదా..? పార్టీలో అసంతృప్తుల‌కు త‌నే చేజేతులా అవ‌కాశం క‌ల్పించారా..? ఇక రెండేళ్ల‌లో జ‌రిగే ఎన్నిక‌లు టీఆర్ఎస్ కు అంత సులువు కాదా..? ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటికీ పొలిటిక‌ల్ విశ్లేష‌కులు అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ సంస్థాగ‌త నిర్మాణంలో భాగంగా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న జిల్లాల అధ్య‌క్ష ప‌ద‌వులను భ‌ర్తీ చేసింది. రాబోయే ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకొని ఈ టీంను ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌త్యేక తెలంగాణ ఏర్ప‌డిన నాటి నుంచి జిల్లాల అధ్య‌క్ష ప‌ద‌వుల‌ను భర్తీ చేయ‌ని అధిష్ఠానం గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా జాబితా విడుద‌ల చేసింది.

ఒకేసారి 33 జిల్లాలకు అధ్య‌క్షుల‌ను నియ‌మించింది. కేసీఆర్ ప్ర‌క‌టించిన జాబితాలో.. 20 మంది ఎమ్మెల్యేలు.., ముగ్గురు ఎంపీలు.., ఇద్ద‌రు ఎమ్మెల్సీలు.., ముగ్గురు మ‌హిళా నేత‌లు ఉన్నారు. మిగ‌తా వారిలో కొంద‌రు ఇత‌ర కార్పొరేష‌న్ ప‌ద‌వుల్లో.. జ‌డ్పీ, మునిసిప‌ల్ ప‌ద‌వుల్లో ఉన్నారు. ఈ జాబితాలో ఉన్న ఇద్ద‌రికి మాత్ర‌మే ఎలాంటి ప‌ద‌వులు లేవు. మిగ‌తా అంద‌రూ ద్విముఖ పాత్ర పోషించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ జాబితాతో బీటీ (బంగారు తెలంగాణ) నేత‌ల‌కు.., యూటీ (ఉద్య‌మ తెలంగాణ‌) నేత‌ల‌కు స‌మ ప్రాధాన్యం ఇచ్చిన‌ట్లు అయింది.

అయితే.. ఈ జాబితాపై అసంతృప్తులు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా ప‌ద‌వులు లేకుండా ఖాళీగా ఉన్న త‌మ‌ను అధినేత క‌రుణిస్తాడ‌ని అనుకుంటే.. ప‌ద‌వులు ఉన్న వారికే మ‌ళ్లీ ప‌ద‌వులు కేటాయించార‌ని.. ఇది పార్టీని తిరోగ‌మ‌నంలోకి తీసుకెళ్ల‌డ‌మేన‌నే ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. రెండు ప‌ద‌వుల్లో ఉన్న వారు మ‌రో ప‌ద‌వికి త‌గిన న్యాయం చేయ‌లేర‌ని.. దీని వ‌ల్ల మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని అంటున్నారు. ఈ జాబితా ద్వారా కార్య‌క‌ర్త‌ల‌కు ఏం స‌మాధానం ఇస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

ఈ జాబితాపై పార్టీ పెద్ద‌ల్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అధ్య‌క్షుడిగా ఉన్న ఒక ఎమ్మెల్యే జిల్లాలో మ‌రో ఎమ్మెల్యేని ఎలా నిర్దేశించ‌గ‌ల‌డ‌ని అనుమానిస్తున్నారు. పార్టీకి సంబంధించిన ఇత‌ర ప‌ద‌వుల భ‌ర్తీలో.. పార్టీ కార్య‌క్ర‌మాల్లో స‌మ‌న్వ‌యం ఎలా సాధ్య‌మ‌నే ఆందోళ‌న‌లో ఉన్నారు. అయితే కొంద‌రు పెద్ద‌లు మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆర్థికంగా భ‌రించే వారినే ఎంపిక‌ చేశారంటున్నారు. అలాగే.. జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేల‌ను కాద‌ని.. మ‌రో వ్య‌క్తికి ప‌వ‌ర్ అప్ప‌గించ‌లేమ‌నే భావ‌న‌లో ఉన్నారు. ఈ కొత్త అధ్య‌క్షులు పార్టీని ఎలా ముందుకు తీసుకెళ‌తారో..? ఎన్నిక‌ల్లో విజ‌య‌తీరాల‌కు చేరుస్తారా..? అనేది వేచి చూడాలి.