కేసీఆర్ ఎందుకు తీసేశారంటే: కొండా మురళి

అటు సినిమా రంగంలోనూ.. ఇటు రాజకీయ రంగంలోనూ ఆసక్తికర చర్చకు తెర తీస్తోంది కొండా మూవీ. కొండా దంపతుల జీవితాన్ని రెండు భాగాల సినిమాగా తీస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని వరంగల్ లోని కొండా మురళీ కార్యాలయంలో నిర్వహించటం.. దానికి చిత్ర టీం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కొండా మురళీ మాట్లాడే సందర్భంలో సినిమా గురించి కాకుండా.. తన రియల్ జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.

సుదీర్ఘ కాలంగా తాను రాజకీయాల్లో ఉన్నప్పటికీ తాను ఇప్పటివరకు ఒక్క నేత కాళ్లు మాత్రమే మొక్కానని.. చివరకు తాము ఎంతో అభిమానించే వైఎస్ కాళ్లు కూడా మొక్కలేదన్నారు. మిగిలిన వారి మాదిరి కాళ్లు మొక్కడం.. ఆ తర్వాత కాళ్లు గుంజటం లాంటివి తాను చేయనని చెప్పిన కొండా మురళీ.. తాను సీనియర్ నేత ఎం.సత్యనారాయణ కాళ్లు మాత్రమే మొక్కానని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమకు చాలా దగ్గరని కానీ ఎవరి కాళ్లు మొక్కలేదన్నారు. ఎక్కడైనా సరే.. అందరి ముందు కాళ్ల మీద కాళ్లు వేసుకొని కూర్చుంటానని.. బూట్లు కూడా విప్పనని చెప్పారు.

తన తీరుతోనే కేసీఆర్ కు కోపం వచ్చి తనను తీసివేయటం జరిగిందంటూ మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. బ్రాహ్మణులు కనిపిస్తే మాత్రం తాను గౌరవిస్తానని చెప్పారు. యువతకు తాను చెప్పేదొక్కటేనని చెప్పిన కొండా మురళీ.. బేసిక్ మొబైల్ ఫోన్ చూపించి.. దీన్నే అందరు వాడాలన్నారు. సెల్ ఫోన్ వచ్చాక.. యూట్యూబ్ కొట్టటమో.. ఆ ట్యూబ్ కొట్టటమో చేస్తున్నారని.. సమాజం ఖరాబైందన్నారు. చాలామంది తనను అడుగుతారని.. వర్మ కూడా ఐప్యాడ్ వాడమని అడిగారని.. కానీ దాన్ని వాడటం మొదలు పెడితే.. ఎవరేం చేస్తుంటారు? ఎవరెన్ని కబ్జాలు చేస్తున్నారు? శత్రువులు ఏం చేస్తున్నారు? ఇలాంటివేమీ ఆలోచించటం ఉండదన్నారు.

రోజుకు రెండు గంటలైనా జనం కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ వస్తుందని.. స్కైఓవర్లు.. ఫ్లైఓవర్లు వస్తాయని చెప్పారని.. కానీ బలిసినోడు బలిసిపోతున్నాడని.. బక్కజీవి బక్కగానే ఉన్నాడన్నారు. తన తల్లి స్తూపాన్ని టచ్ చేసి.. తనను లేపారని.. ఇక ఆగేది లేదంటూ సినిమా ట్రైలర్ వేళ.. రాజకీయ అంశాల్ని చెప్పుకొచ్చారు. కొండా సురేఖ వరంగల్ బరిలో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే ఆమె ప్రజల్లోకి వెళుతుందని.. తాను కూడా జనంలోకి వస్తున్నానని.. కొవిడ్ కానీ.. ఒమిక్రాన్ కానీ వెనక్కితగ్గేదే లేదని స్పష్టం చేశారు.