కాపుల ఉద్య‌మం మొదలైందా?

ఏపీలో కాపులు మ‌ళ్లీ విజృంభించ‌నున్నారా?  వారు మ‌రోసారి ఉద్య‌మాన్ని ప్రారంభించే దిశ‌గా అడుగులు వేస్తున్నారా? అంటే… తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కు లు. ఏపీలో కాపు సామాజిక వ‌ర్గం ఉద్య‌మం గురించి అంద‌రికీ తెలిసిందే. బీసీల‌తో స‌మానంగా త‌మ‌కు కూడా రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌నేది వారి ప్ర‌ధాన డిమాండ్. గ‌త 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌మ‌కు టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఈ మేర‌కు హామీ ఇచ్చార‌ని పేర్కొంటూ.. తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం.. రెండేళ్ల‌పాటు ఉద్య‌మించి.. చివ‌ర‌కు ఉప‌శ‌మించారు.  

వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఇక త‌న్న వ‌ల్ల‌కాదంటూ.. ముద్రగ‌డ ప‌క్క‌కు త‌ప్పుకొన్నారు. ఇక‌, అప్ప‌టి నుంచి కాపుల గురించి పెద్ద‌గా ఇప్ప‌టి వ‌ర‌కు అంటే.. దాదాపు రెండేళ్ల‌పాటు ఎవ‌రూ మాట్టాడింది లేదు. అంతేకాదు… ఎవ‌రూ.. రిజ‌ర్వేష‌న్ గురించి ప్ర‌శ్నించింది కూడా లేదు. అయితే.. ఇప్పుడు మ‌ళ్లీ క‌ద‌లిక వ‌చ్చింది. మ‌రో రెండేళ్ల‌లో ఎన్నిక‌లు వున్న నేప‌థ్యంలో ఏపీలో కాపులు సంఘ‌టితం కావాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం.. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై మ‌ళ్లీ ఉద్య‌మించాల‌ని భావిస్తుండ‌డం రాజ‌కీయంగా కూడా ఆస‌క్తిని రేపుతోంది.

కాపు ముఖ్య నాయకులు  తాజాగా విజ‌య‌వాడ వేదిక‌గా.. ఆన్‌లైన్‌లో భేటీ అయ్యారు. కరోనా థర్డ్ వేవ్‎తో వర్చువల్‎గా జ‌రిగిన‌ భేటీలో 16 మంది నేతలు హాజరయ్యారు. సుమారు రెండు గంటల పాటు ఈ సమావేశం సాగింది. అన్ని కులాలను కలుపుకుని ముందుకు వెళ్లాలని మెజార్టీ సభ్యులు సూచనలు చేశారు. అన్ని కులాలను కలుపుకుని ఐక్యవేదిక ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. దళితులు, వెనకబడిన వర్గాల ముఖ్యనేతలతో టచ్‎లో ఉన్న కాపు ముఖ్యనేతలు ఫిబ్రవరి రెండవ వారంలో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు.

విజయవాడలో సమావేశం అయ్యేందుకు సూత్రపాయంగా అంగీకారం తెలిపారు. ఆ సమావేశంలో కోర్ కమిటీ వేయాలని సూచనలు చేశారు. అయితే ఈ సమావేశానికి వైసీపీలో ఉన్న కాపు నేతలు దూరంగా ఉన్నారు.  మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, వట్టి వసంతకుమార్, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రామ్మో హాన్, ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు, ముద్రగడ్డ అనుచరుడు ఆరేటి ప్రకాశ్ తదితరులు హాజరయ్యారు. ఈ క్ర‌మంలో రిజ‌ర్వేష‌న్‌ల అంశంపై.. దృష్టి పెట్టాల‌ని భావించారు. మొత్తానికి కాపుల దూకుడు ఎన్నిక‌ల నాటికి బ‌ల‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.