బుర‌ఖాలు వ‌ద్దు.. పాఠ‌శాల‌ల‌కు అనుమతించం.. క‌ర్ణాట‌క మంత్రి

బీజేపీ పాలిత క‌ర్ణాట‌క రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి బీసీ న‌గేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముస్లిం మైనారిటీ వ‌ర్గానికి చెందిన విద్యార్థినులు త‌మ సంప్ర‌దాయం ప్ర‌కారం.. బుర‌ఖాలు ధ‌రించి.. పాఠ‌శాల‌కు, కాలేజీల‌కు రావడాన్ని ఆయ‌న తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. దీనిని సీరియ‌స్‌గా తీసుకుంటున్నామ‌ని ఆయ‌న తెలిపారు. అంతేకాదు.. విద్యార్థినులు బుర‌ఖాలు ధ‌రించి వ‌స్తే.. పాఠ‌శాల‌ల‌కు మేం అనుమ‌తించేది లేద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. దీంతో ఇప్పుడు మంత్రి వ్యాఖ్య‌లు వివాదాన్ని రేపుతున్నాయి.

మైనారిటీ విద్యార్థినులు పాఠశాలలు, కాలేజీలకు బురఖాలు ధరించి రావడం క్రమశిక్షణా రాహిత్యానికి నిదర్శనమని విద్యా శాఖ మంత్రి బీసీ నగేష్ అన్నారు. “1985లో యూనిఫామ్ లను ప్రవేశపెట్టింది విద్యార్థులలో ఏకత్వం తీసుకురావడం కోసమే. విద్యాలయాలు ఒకరి మత ఆచారాలకు వేదిక కాకూడదనే” అని మంత్రి క్లాస్ పీకారు. ఉడిపి జిల్లా బాలికల ప్రభుత్వ కాలేజీ.. బురఖాలతో విద్యార్థినులను అనుమతించడం లేదు. దీంతో బురఖాతో తరగతి గదిలోకి అనుమతించాలని డిమాండ్ చేస్తూ ఆరుగురు విద్యార్థినులు గత డిసెంబర్ నుంచి కాలేజీ వద్దే నిరసనకు దిగారు.

దీనిపై మంత్రి స్పందిస్తూ, విద్యార్థుల చర్య రాజకీయ ప్రేరేపితమేన‌ని అన్నారు. కాలేజీ చర్యను సమర్థిస్తున్న‌ట్టు మంత్రి నగేష్ చెప్పారు. “ఒకవేళ ఆరుగురు విద్యార్థినులు తమ మత విశ్వాసాన్ని ఆచరించే విషయంలో అంత మొండిగా ఉంటే కాలేజీ నుంచి వెళ్లిపోవచ్చు. బురఖాలను అనుమతించే మరో విద్యా సంస్థలో చేరొచ్చు” అని మంత్రి నగేశ్ స్పష్టం చేశారు.

అదే కాలేజీలో మరో 94 మంది ముస్లిం విద్యార్థినులు యూనిఫామ్ తో వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. పైగా ఇప్పుడు నిరసనకు దిగిన ఆరుగురు విద్యార్థినులు సైతం గత ఏడాదిన్నరగా బురఖాలు లేకుండానే క్లాస్ కు హాజరైనట్టు చెప్పారు. రాష్ట్రంలో ఇలాంటి సంప్ర‌దాయానికి ఒక్క‌సారి అనుమ‌తిస్తే.. ఇక‌, ఇదే కొన‌సాగుతుంద‌ని.. ఇత‌ర మ‌తాల వారు కూడా వివిధ రీతుల్లో హాజ‌ర‌వుతార‌ని.. అప్పుడు స్కూళ్లు కాస్తా.. మ‌తాల‌కు వేదిక‌లుగా మారుతాయ‌ని మంత్రి చెప్పుకొచ్చారు. విద్యార్థుల మ‌ధ్య మ‌త సామ‌ర‌స్యం ఉండాల‌ని సూచించారు. అయితే.. మంత్రి వ్యాఖ్య‌ల‌ను విప‌క్షాలు త‌ప్పుబడుతున్నాయి. రాష్ట్రాన్ని హిందూత్వం చేయాల‌నే ఉద్దేశంతోనే మంత్రి ఇలా చేస్తున్నార‌ని వ్యాఖ్యానించాయి.