ప్రభుత్వానికి ట్రెజరీ ఉద్యోగుల షాక్..జీతాలకు బ్రేక్

కొత్త పీఆర్సీ పద్దతిలో జీతాల బిల్లలు రెడీ చేసేది లేదని చెప్పి ప్రభుత్వానికి ట్రెజరీ ఉద్యోగులు పెద్ద షాకే ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలాఖరులో బిల్లులు రెడీ చేస్తేనే బ్యాంకుల ద్వారా జీతాలు అందుతాయి. అదే పద్దతిలో ఇపుడు కూడా కొత్త పీఆర్సీ ప్రకారమే బిల్లులు రెడీ చేయమంటే అందుకు ట్రెజరీ సిబ్బంది నిరాకరించారు. పీఆర్సీ విషయమై ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య పెద్ద వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.

గురువారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, టీచర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కారు. కొత్త పీఆర్సీ ప్రకారం తమకు జీతాలొద్దని, పాత పీఆర్సీ ప్రకారమే జీతాలు కావాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సరిగ్గా ఇదే సమయంలో ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారమే బిల్లులు రెడీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశాలనే ట్రెజరీ ఉద్యోగులు ఉల్లంఘించారు.

పీఆర్సీ విషయంలో సమ్మె చేస్తున్న ఉద్యోగుల్లో తాము కూడా భాగమే కాబట్టి కొత్త పీఆర్సీ ప్రకారం జీతాల బిల్లులు రెడీ చేసేది లేదని తెగేసి చెప్పేశారు. రాష్ట్రంలో ఉన్న రెండు ట్రెజరీ సర్వీసు అసోసియేషన్ ఉద్యోగులు ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు స్పష్టంగా చెప్పేశారు. అంటే పీఆర్సీ వివాదం తేలేంతవరకు ఉద్యోగులకు జీతాలు అందే అవకాశం లేదు. ఎందుకంటే కొత్త విధానంలో బిల్లులు రెడీ చేయటానికి ట్రెజరీ ఉద్యోగులు కుదరదన్నారు.

అలాగని పాత విధానంలో జీతాలు ఇవ్వాలంటే మొత్తం సాఫ్ట్ వేర్ ను మార్చేశారు. కాబట్టి పాత సాఫ్ట్ వేర్ ఇక పనిచేయదు. సాఫ్ట్ వేర్ పనిచేయకపోతే బిల్లులు రెడీ చేయటం సాధ్యం కాదు. కాబట్టి పీఆర్సీ వివాదం ఎంత తొందరగా తేలితే ఉద్యోగులకు అంత తొందరగా జీతాలు అందుతాయి. కొత్త పీఆర్సీ పద్ధతిలో ఉద్యోగులకు జీతాలు తగ్గవని చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ చెబుతున్నారు. ఇదే సమయంలో హెచ్ఆర్ఏలో కోత, సీసీఏ రద్దు వల్ల జీతాలు తగ్గుతాయంటు ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఇద్దరిలో ఎవరు చెప్పేది నిజమో తేలాలంటే ముందు జీతం అందుకోవాల్సిందే. కానీ ఇపుడు జీతం వచ్చే పరిస్ధితి లేదు. మరేం చేయాలి ? అన్నదే ప్రశ్న. ఇది ఎలా తయారైందంటే చెట్టు ముందు విత్తు ముందు అన్న ప్రశ్నలాగ తయారైంది. చివరకు ఈ వివాదం ఎప్పుడు, ఏ రూపంలో పరిష్కారమవుతుందో చూడాల్సిందే.