అన్ని పార్టీలది అదే జపం?

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రతి పార్టీ ఓబీసీ జపాన్ని పెంచేస్తున్నాయి. యూపీలో ఓబీసీలు 37 శాతమున్నారు. వీరిలో యాదవుల బలం 12 శాతం. యాదవుల్లో అత్యధికులు ఎస్పీ మద్దతుదారులే అన్నది అందరికీ తెలిసిందే. మిగిలిన 25 శాతం యాదవేతర బీసీల ఓట్లు ఎవరికి పడతాయన్నదే కీలకమైపోయింది. 25 శాతం ఓట్లంటే మామూలు విషయం కాదు. అందుకనే అన్ని పార్టీలు ప్రధానంగా బీజేపీ, ఎస్పీ ఓబీసీల జపం చేస్తున్నాయి.

ఓబీసీల ఓట్లను కొల్లగొట్టడం కోసమే పార్టీల మధ్య వలసలు బాగా పెరిగిపోతున్నాయి. బీజేపీ నుంచి ఎస్పీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్య ఓబీసీలో బలమైన నేతగా పాపులర్. ఈయనకు 20 నియోజకవర్గాల్లో బాగా పట్టుందంటున్నారు. అలాగే మరో ఇద్దరు మంత్రులతో పాటు ఐదుగురు ఎంఎల్ఏలు కూడా బీజేపీకి రాజీనామా చేసి ఎస్పీలో చేరిపోయారు. వీరిలో అత్యధికులు ఓబీసీ వారే. దాంతో బీజేపీలో కలవరం పెరిగిపోతోంది.

అందుకనే కాంగ్రెస్ లోని ఓబీసీకి చెందిన ఓ ఎంఎల్ఏని తమ పార్టీలోకి లాక్కుంది. 2017 అసెంబ్లీ, 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ బాగా లాభపడిందంటే అందుకు కారణం ఓబీసీల మద్దతే. అలాంటిది ఇపుడు 25 శాతం  ఓబీసీల్లో మెజారిటి ఓట్లు తమకు ఎక్కడ దూరమైపోతాయో అనే టెన్షన్ పెరిగిపోతోంది. అసలే బ్రాహ్మణులు, జాట్లు, దళితులు బీజేపీపై బాగా ఆగ్రహంతో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఓబీసీలు కూడా దూరమైతే బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తప్పదు.

ఆ దెబ్బను తప్పించుకునేందుకే ఒకవైపు ఓబీసీలను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తు మరోవైపు తమపై ఆగ్రహంతో ఉన్నారని చెబుతున్న సామాజికవర్గాలను దువ్వే ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చెప్పలేకున్నారు. ఇదే సమయంలో ఓబీసీల ఓటుబ్యాంకును దగ్గరకు తీసుకునేందుకు ఎస్సీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ రెండుపార్టీల పరిస్ధితి ఇలాగుంటే మిగిలిన బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఏమి చేసున్నాయో కూడా పెద్దగా తెలీటంలేదు. సో ఏ విధంగా చూసినా రాబోయే ఎన్నికల్లో ఓబీసీలే చాలా కీలకమని తెలిసిపోతోంది.