విజయసాయి మాటకు.. RRR దిమ్మ తిరిగే పంచ్

అందరూ ఒకేలా ఉండరు. ఒకరి మీద విజయవంతమైన ఫార్ములా అందరికి అదే సూట్ అవుతుందనుకుంటే అంతకు మించిన అమాయకత్వం ఉండదు. ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి. రోటీన్ భిన్నంగా.. మర్యాదల్నిపక్కన పెట్టేసి.. కాస్తంత ముతక భాషను వాడేసి.. తమ రాజకీయ ప్రత్యర్థుల్ని గేలి చేయటం.. ఎటకారం ఆడేయటం.. తీవ్రమైన నిందల్ని సంధిస్తూ ట్వీట్లు చేసే విషయంలో విజయసాయి ట్రాక్ రికార్డును మరెవరూ టచ్ చేయని పరిస్థితి.

ఒకటి మనం మొదలు పెట్టాలే కానీ..అంతకు మించి అనేందుకు ఎవరో ఒకరు వస్తారు. ఇప్పుడు అలాంటి వ్యక్తి వచ్చేశారు. తమ సొంత పార్టీకి చెందిన నరసాపురం రెబల్ ఎంపీ రఘురామ క్రిష్ణమ రాజు ట్వీట్లు ఎంత పచ్చిగా.. వాడిగా.. వేడిగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండదు. నువ్వు రెండు అంటే నేను పన్నెండు అంటానన్నట్లుగా ఆయన ట్వీట్లు ఉంటాయి. కనుమ పండుగ రోజున ఎంపీ రఘురామ రాజును ఉద్దేశించి విజయసాయి పెట్టిన ట్వీట్ రచ్చగా మారితే.. దానికి అంతే స్థాయిలో రియాక్టుఅయితే.. మరింత విపరీత ఆరోపణ చేయటం ద్వారా వీరిద్దరి ట్వీట్ సంవాదం అందరిని ఆకర్షించి.. హాట్ టాపిక్ గా మారింది.

‘‘గుడ్డ కాల్చి మొహాన వేస్తే ఆ మసిని వారే తుడుచుకుంటారులే అనుకుంటున్నాడు. ఢిల్లీలో కూర్చొని ‘నన్ను చంపేస్తారు’ అని ఏడుపు మొదలెట్టాడు. నర్సాపురం ప్రజలకు మొహం చూపించలేకే ఈ పబ్లిసిటీ స్టంట్. చీప్ పబ్లిసిటీ వస్తుందంటే చివరకు గోదాట్లోకైనా దూకి నన్ను ఎవరో తోసేశారు అనే రకం’’ అంటూ ఎంపీ విజయసాయి ట్వీట్ సంధిస్తే.. దానికి రియాక్టు అయిన రఘురామ రాజు.. అంతకు మించి అన్న రీతిలో ట్వీట్ పంచ్ ఇచ్చారు.

‘‘వీడిని విశాఖ నుంచి గెంటేసి అండమాన్ కి పంపిస్తే మళ్ళీ వచ్చేసాడు. ఎన్ని సార్లు ముఖ్యమంత్రి చేతిలో తన్నులు తిన్నా సిగ్గులేదు వీడికి. రేపో మాపో వీడు కూడా నా దారి పడతాడు. Let us wait and see!’’ అంటూ ఘాటుగా రియాక్టు అయ్యారు. ఇదంతా చూసినప్పుడు.. కదిలించుకోవటం ఎందుకు? అనిపించుకోవటం ఎందుకు? అన్న మాట మదిలో మెదలక మానదు. ఈ ట్వీట్ సంవాదానికి మరో అడుగు ముందుకు వేసిన విజయసాయి.. తనపై ఆర్ఆర్ఆర్ చేసిన వ్యాఖ్యకు సమాధానం చెప్పే కన్నా.. మరో ఘాటు వ్యాఖ్యను చేశారు.

‘‘రాజీనామా మాటకు కట్టుబడని వాడు చచ్చిన పాముతో సమానం రాజా. గతంలో శ్రీదేవినో, రేఖనో పెళ్లి చేసుకున్నానంటూ బోగస్ ఫోటోలు చూపి తమతో కాపురం చేసేలా ఆదేశాలివ్వాలంటూ కొందరు కోర్టులకు ఎక్కేవారు. ఇలాంటి పిటిషన్లే వేస్తూ ఢిల్లీలో టైంపాస్ చేసే గల్లీ లీడర్ పచ్చ చానళ్ళకు ఐటం పీస్ గా మారాడు’’ అంటూ విరుచుకుపడ్డారు. దీనికి రఘురామ రాజు స్పందించాల్సి ఉంది. చూస్తుంటే.. ఈ ట్వీట్ల పంచాయితీ ఇప్పట్లో తెగేలా కనిపించట్లేదు.