యూపీ పీఠం ఎవరిదో చెప్పిన తాజా సర్వే..

2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ గా అభివర్ణిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆసక్తికరం అంశంగా మార్చటం తెలిసిందే. ఎన్నికలు జరుగుతున్నది ఐదు రాష్ట్రాల్లోనే అయినప్పటికీ.. అందరి చూపు మాత్రం ఉన్నది దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ (యూపీ) ఫలితం మీదనేనని చెప్పాలి. ఈ రాష్ట్రంలో వచ్చే ఫలితం జాతీయ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రముఖ మీడియా సంస్థ ఏబీపీ – సీ ఓటర్ సర్వే యూపీలో విజయం ఎవరిదన్న విషయంపై తాను చేసిన సర్వేను విడుదల చేసింది.

దీని ప్రకారం 403 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ లో బీజేపీ 235 స్థానాల్ని దక్కించుకొని తిరిగి అధికారంలోకి రావటం ఖాయమని తేల్చింది. తాజాగా చేపట్టిన సర్వే ఆధారంగా బీజేపీకి 41. 5  శాతం ఓటింగ్ దక్కవచ్చని పేర్కొంది. ప్రధాన ప్రతిపక్షంగా అఖిలేశ్  సారధ్యంలోని సమాజ్ వాదీ పార్టీ నిలుస్తుందని.. ఆ పార్టీకి 157 సీట్లు వస్తాయని.. మాయవతి నేతృత్వంలోని బీఎస్పీకి 16 సీట్లు.. కాంగ్రెస్ కు పది లోపు సీట్లు సొంతమయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
అయితే.. యూపీలో మరోసారి బీజేపీదే విజయం ఖాయమన్నవిషయం ఇప్పటికే నిర్వహించిన పలు సర్వే ఫలితాలు స్పష్టం చేయటం తెలిసిందే. ఇదే విషయాన్ని మరోసారి వెల్లడించినట్లుగా తాజా సర్వేను చూసినట్లుచెప్పాలి. ఇక.. ఎన్నికలు జరిగే మిగిలిన నాలుగు రాష్ట్రాల విషయానికి వస్తే..

మణిపూర్
బీజేపీ -కాంగ్రెస్ మధ్య పోటాపోటీగా పోటీ ఉందని.. ఈసారి హంగ్ కు ఎక్కువ అవకాశం ఉందని చెబుతున్నారు. బీజేపీకి 27.. కాంగ్రెస్ కు 26 స్థానాలు దక్కుతాయని సర్వే వెల్లడించింది.


గోవా
బీజేపీకే అధిక్యత లభిస్తుందని.. అధికార పార్టీకి 23 స్థానాలు.. ఆమ్ఆద్మీ పార్టీకి 9..కాంగ్రెస్ కు8 స్థానాలు లభిస్తాయని అంచనా వేశారు.


పంజాబ్
ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ రానున్న రోజుల్లో ప్రధాన ప్రతిపక్షంగా మారనుందని సర్వే వెల్లడించింది.ఆమ్ ఆద్మీ పార్టీ 58 స్థానాల్లో విజయం సాధిస్తుందని. కాంగ్రెస్ కు 43 స్థానాలు దక్కుతాయని అంచనా వేశారు. శిరోమణి అకాలీదళ్కు 23.. బీజేపీకి 3 స్థానాలు దక్కే అవకాశం ఉంది.


ఉత్తరాఖండ్
బీజేపీ – కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంది. బీజేపీకి 37.. కాంగ్రెస్ కు 36 స్థానాలు దక్కుతాయని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. అతి పెద్ద రాష్ట్రమైన యూపీతో పాటు చిన్న రాష్ట్రాలైన గోవాలో బీజేపీ విజయం సాధిస్తే.. పంజాబ్ లో కమలం పార్టీ పత్తాలేకుండా పోతుందని తేల్చారు. ఇక..మణిపూర్.. ఉత్తరాఖండ్ లో పోటీ తీవ్రంగా ఉండి.. హంగ్ కు అవకాశం ఉంటుందని సర్వే చెప్పింది. మరి.. ప్రజాతీర్పు ఎలా ఉందని తేలాలంటే మార్చి రెండో వారం వరకువెయిట్ చేయక తప్పదు.