ఇదేం న్యాయం జ‌గ‌న‌న్నా?

సంక్రాంతి ముంగిట‌.. ఏపీ ప్ర‌బుత్వం తీసుకున్న నిర్ణ‌యం.. సానుభూతి ప‌రుల‌ను కూడా విస్మ‌యానికి గురి చేస్తోంది. సీఎం జ‌గ‌న్ ఆలోచ‌న‌లోపై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ప్ర‌స్తుతం ఏపీలో సినిమా టికెట్ల వివాదం కొన‌సాగుతూనేఉంది.  సినిమా నిర్మాణాల‌కు సంబంధం లేకుండా.. అన్ని సినిమాల‌కు ఒకే టికెట్ ధ‌ర ఉండాల‌నే నిర్ణ‌యానికి తోడు.. సినిమా టికెట్ల‌ను 1970ల స్థాయికి దింపేశారంటూ.. నెటిజ‌న్లు ఫైర‌వుతున్నారు. దీనివ‌ల్ల క్వాలిటీ దెబ్బ‌తింటుందని కూడా అంటున్నారు. ఈ విష‌యంపై అటు సినిమా  వ‌ర్గాల‌కు ప్ర‌బుత్వానికి మ‌ధ్య వివాదం కొన‌సాగుతూనే ఉంది.

ఇదిలావుంటే.. ఇప్పుడు పండ‌గ పూట‌.. జ‌గ‌న్ స‌ర్కారు తీసుకున్న మ‌రో నిర్ణ‌యం మ‌రింత విస్మ‌యానికి గురిచేస్తోంది. ప్ర‌ధానంగా క‌రోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ విష‌యంలో.. క‌ట్ట‌డి పేరుతో తీసుకున్న నిర్ణ‌యాలు.. ఒక్కొక్క‌రికి ఒక్కోలా వ‌ర్తింప‌చేయ‌డం.. అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఇదేంది జ‌గ‌న‌న్నా..! అంటూ.. ప్ర‌శ్న‌లు గుప్పిస్తున్నారు. విష‌యంలోకి వెళ్తే.. ఒమిక్రాన్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వం నైట్ క‌ర్ఫ్యూను అమ‌లుచేస్తోంది. అదేస‌మ‌యంలో సినిమా హాళ్ల‌కు సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సినిమా హాళ్ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు(అంటే ఇటీవ‌ల క‌రోనా త‌గ్గిన నేప‌థ్యంలో)  ఫుల్ ఆక్యుపెన్సీ కి అనుమ‌తి ఇచ్చారు.

అయితే.. ఇప్పుడు మ‌రోసారి ఒమిక్రాన్ వ్యాపిస్తున్న నేప‌థ్యంలో మ‌ళ్లీ ఆక్యుపెన్సీపై కొర‌డా ఝ‌ళిపించింది ప్ర‌భుత్వం. కేవ‌లం 50 శాతం మంది ప్రేక్ష‌కుల‌తోనే సినిమాలు న‌డుపుకోవాల‌ని తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. అదేస‌మ‌యంలో ఇప్ప‌టికే టికెట్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించిన విష‌యం తెలిసిందే. అంటు.. ఇటు సినిమా టికెట్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించ‌డం ఒక దెబ్బ అయితే.. ఇప్పుడు ఆక్యుపెన్సీని స‌గానికి కోసేయ‌డం.. మ‌రో భారీ దెబ్బ‌గా.. సినీ అభిమానులు పేర్కొంటున్నారు. స‌రే! ఇదే ఒమిక్రాన్ ఆంక్ష‌లు అన్ని విభాగాల‌కూ ఒకే విధంగా ఉన్నాయా? అంటే.. అది లేదు. పండ‌గ పూట ప్ర‌భుత్వ రంగంలోని ఆర్టీసీ ఖ‌జానాను నింపుకునేందుకు జ‌గ‌న్ స‌ర్కారు 2000 కొత్త స‌ర్వీసుల‌ను ప్ర‌వేశ పెట్టింది.

ఈ కొత్త స‌ర్వీసుల‌కు ఫుల్లుగా న‌డుపుకునేందుకు అంటే ఎన్ని సీట్లు ఉంటే.. అంద‌రు ప్ర‌యాణికుల‌ను ఎక్కించుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది. అంతేకాదు.. టికెట్ ధ‌ర‌ల‌పై 50 శాతం అద‌న‌పు బాదుడుకూ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. పండ‌గ పూట ప్ర‌యాణాలు ఎక్కువ‌గా ఉంటున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌(ప్ర‌భుత్వ దృష్టిలో పేద‌లు అనుకోవ‌చ్చు) జేబులు గుల్ల చేసేందుకు రెడీ అయింది. అంతేకాదు.. ఒమిక్రాన్ వ్యాప్తి విష‌యంలో సినిమా హాళ్ల‌పై విధించిన నిబంధ‌న‌లు.. ఆర్టీసికి మిన‌హాయింపు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. అందుకే.. ఇదేంది జ‌గ‌న‌న్నా..? అని ప్ర‌శ్నిస్తున్నారు.