టీడీపీ యంగ్ టైగర్.. ప్లాన్ చేంజ్?

రాబోయే ఎన్నిలకు సంబంధించి శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీలో పెద్దమార్పులే జరగబోతున్నాయట. టీడీపీ యంగ్ టైగర్ గా క్రేజ్ అందుకుంటున్న శ్రీకాకుళం ఎంపీ ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో లేరని సమాచారం. నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు పార్టీలోనే చర్చ జరుగుతోంది. మరి ఎంపీ సీటును కాదని అసెంబ్లీకి ఎందుకు పోటీ చేయాలని కింజరాపు అనుకుంటున్నారనే విషయంలో క్లారిటి లేదు.

టీడీపీ ఆవిర్భావం తర్వాత శ్రీకాకుళం పార్లమెంటుకు కింజరాపు కుటుంబమే ఎక్కువసార్లు పోటీచేసింది. కింజరాపు ఎర్రన్నాయుడు వారసుడిగా రామ్మోహన్ నాయుడు ఎంపీ గా పోటీ చేసి గెలిచారు. ఈ పార్లమెంటు నియోజకవర్గంపై కింజరాపు కుటుంబానికి మంచి పట్టుంది. మరంతటి పటున్న ఎంపీ నియోజకవర్గాన్ని కాదని నరసన్నపేట అసెంబ్లీకి పోటీ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు ? అన్నదే సస్పెన్సుగా మారింది. పైగా నరసన్నపేటలో టీడీపీ రికార్డు కూడా ఏమంత ఘనంగా లేదు.

ఇపుడు ఈ నియోజకవర్గం నుంచి ధర్మాన కృష్ణదాస్ వైసీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  ధర్మాన కుటుంబానికి నియోజకవర్గంలో మంచి పట్టుంది. అలాంటిది లోక్ సభ నియోజకవర్గాన్ని కాదని అసెంబ్లీకి పోటీ చేయటం ద్వారా రామ్మోహన్ నాయుడు గట్టిపోటీని ఎదుర్కోవాల్సొస్తుంది. పార్లమెంటు సీటుకు తనకు బదులుగా తన సోదరి, రాజమండ్రి ఎంఎల్ఏ ఆదిరెడ్డి భవాని పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. వివాహమైపోయి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రికి వెళ్ళిపోయిన భవానానీని మళ్ళీ పుట్టింటికి ఎందుకు తీసుకువద్దామని అనుకుంటున్నారో తెలీటం లేదు.

ఇపుడు టీడీపీ ఇన్చార్జిగా ఉన్న బగ్గు రమణమూర్తి పరిస్ధితే అయోమయంగా తయారైంది. ఇదే సమయంలో కృష్ణదాస్ స్ధానంలో వచ్చే ఎన్నికల్లో ఆయన వారసుడు చైతన్య పోటీ చేయబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. అలాగే ధర్మాన ప్రసాదరావుకు బదులు రాబోయే ఎన్నికల్లో ఆయన కొడుకు రమ్మనోహర్ నాయుడు పోటీలోకి దిగబోతున్నారనే ప్రచారం కూడా పెరిగిపోతోంది. ఏదేమైనా శ్రీకాకుళం జిల్లాలో వచ్చే ఎన్నికల్లో పెద్ద మార్పులే ఉండబోతున్నట్లు అనిపిస్తోంది.