డిపాజిట్లు కూడా రాని పార్టీ బీజేపీ: క‌విత

తెలంగాణ బీజేపీ నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌లు తెలిసిన‌వే. పార్టీ చీఫ్ బండి సంజ‌య్ నుంచి నాయ‌కులు అంద‌రూ కూడా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు  అధికార టీఆర్ ఎస్ నుంచి కీల‌క నేత‌లు ఎవ‌రూ పెద్ద‌గా కౌంట‌ర్ ఇవ్వ‌లేదు. బండి వ్యాఖ్య‌ల‌పై కొన్నాళ్ల కింద‌ట సీఎం కేసీఆర్ రియాక్ట్ అయ్యారు త‌ప్ప‌.. మిగిలిన నాయ‌కులు ఎవ‌రూ స్పందించ‌లేదు. కానీ, తాజాగా.. అస్సో సీఎం హిమంత బిస్వ‌శ‌ర్మ‌.. తెలంగాణ‌కు వ‌చ్చారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న తెలంగాణ ప్ర‌భుత్వంపై కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. అవినీతి.. కుటుంబ పాల‌న‌.. అంటూ.. శ‌ర్మ‌.. కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పై టీఆర్ ఎస్ మ‌హిళా నాయ‌కురాలు, సీఎం కేసీఆర్ త‌న‌య‌, ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని తుడిచిపెట్టడానికి బీజేపీ ఎందుకు ప్రయత్నిస్తోందని.. ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు.  

2018 ఎన్నికల సమయంలో బీజేపీ 107 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిన విషయాన్ని ప్రస్తావించారు. “2018 ఎన్నిక‌ల‌ను యాదికి తెచ్చుకోండి. 107 చోట్ల ప్ర‌జ‌లు ఛీకొట్టారు. క‌నీసం మీ నేత‌ల‌కు డిపాజిట్లు కూడా రాలేదు“ అంటూ.. స్ట్రాంగ్ కామెంట్లు కుమ్మ‌రించారు. అంతేకాదు.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు మాత్రమే టీఆర్ఎస్ పార్టీకి ప్రధాన అజెండా అని క‌విత‌ పేర్కొన్నారు.

తెలంగాణలో ఇప్పటికే లక్షా 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్టు క‌విత‌ పేర్కొన్నారు. హైదరాబాద్ కేంద్రంగా లక్షలాది మందికి ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించి తెలంగాణ… దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని గతంలో చెప్పిన కేంద్రంలోని బీజేపీ పాల‌కులు… ఇన్నేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని క‌విత నిల‌దీశారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రకారం, భారత్‌లో నిరుద్యోగిత రేటు డిసెంబర్‌లో దాదాపు 8 శాతానికి పెరిగిందన్న కవిత… సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన… రైతుబంధు, కల్యాణలక్ష్మి, మిషన్ భగీరథ వంటి పథకాలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ   పేర్లు మార్చి అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.