జ‌గ‌న్ బెయిల్.. వాద‌న‌లు స‌మాప్తం

వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం జగన్ బెయిల్‌ రద్దు చేయాలంటూ.. దాఖ‌లైన‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. వైసీపీ ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్ తరఫున న్యాయవాది శ్రీ వెంకటేశ్‌ వాదనలు వినిపించారు. సీఎం హోదాలో జగన్‌ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంలో జగన్‌కు నోటీసులు ఇవ్వాలని కోరారు. బెయిల్ రద్దు పిటిషన్‌పై వైఖరి ఏమిటని హైకోర్టు.. సీబీఐని ప్రశ్నించింది. సీబీఐ కోర్టు తీర్పు తర్వాత పరిస్థితిలో ఏమీ మార్పు లేదని సీబీఐ తరపు న్యాయవాది బదులిచ్చారు. ఇరువైపు వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.

అక్రమాస్తుల కేసులో.. ముఖ్యమంత్రి జగన్తో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. తెలంగాణ హైకోర్టులో ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ.. ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సీబీఐ కోర్టు విధించిన షరతులు ఉల్లంఘించినందున జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఇప్ప‌టికే.. రెండు సార్లు విచార‌ణ జ‌రిగిన నేప‌థ్యంలో వాద‌న‌లు ముగిశాయి.

జగన్, విజయసాయిరెడ్డి సాక్షులను ప్రలోభ పెడుతున్నారని, విచారణ ప్రక్రియను జాప్యం చేస్తున్నారని సీబీఐ కోర్టులో రఘురామ వాదించారు. అయితే.. తాము ఎలాంటి షరతులూ ఉల్లంఘించలేదని.. వ్యక్తిగత ప్రచారం, రాజకీయ ప్రయోజనాల కోసమే రఘురామ పిటిషన్లు దాఖలు చేశారని జగన్, విజయ్ సాయిరెడ్డి సీబీఐ కోర్టులో వాదించారు.

సీబీఐ మాత్రం ఏమీ వాదించకుండా.. పిటిషన్లలోని అంశాలపై చట్టప్రకారం విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. సీబీఐ కోర్టులో సుదీర్ఘ వాదనల అనంతరం.. రఘురామ పిటిషన్లను సీబీఐ కోర్డు కొట్టేసింది. అయితే.. సీబీఐ కోర్టు పలు అంశాలను పరిగణనలోకి తీసుకోలేదంటూ.. తెలంగాణ హైకోర్టులో రఘురామ పిటిషన్ దాఖలు  చేశారు. ఈ కేసులో ఇరువైపు వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం..తాజాగా తీర్పును రిజర్వు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తీర్పు వెల్ల‌డిస్తార‌నేది తెలియాల్సి ఉంది.