జగన్ ప్రభుత్వం చేస్తోంది కరెక్టే కానీ..

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు థియేటర్ల మీద ఉక్కు పాదం మోపుతోంది. ఇప్పటికే టికెట్ల రేట్ల మీద నియంత్రణ తెచ్చిన సర్కారు.. తాజాగా థియేటర్లలో నిబంధనల అమలుపై నిఘా పెట్టింది. లైసెన్సులు రెన్యువల్ చేసుకోని, సేఫ్టీ నిబంధనలు పాటించని థియేటర్లపై కొరడా ఝులిపిస్తోంది. వరుసబెట్టి థియేటర్లను సీజ్ చేస్తోంది. ఇప్పటికే ఏపీలో 170-180 మధ్య థియేటర్లు క్లోజ్ అయినట్లు వార్తలొస్తున్నాయి. ఐతే ఈ విషయంలో జగన్ సర్కారుకు విమర్శలు తప్పట్లేదు. థియేటర్లపై ఎందుకీ కక్ష అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే వాటిని లక్ష్యంగా చేసుకున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఐతే నిబంధనలు పాటించని థియేటర్లను మూసి వేయిస్తే అందులో తప్పేముందన్న ప్రశ్నలు ప్రభుత్వ మద్దతుదారుల నుంచి వస్తున్నాయి. వారి ప్రశ్నల్లోనూ న్యాయముంది. అది సహేతుకమే కావచ్చు. ఏపీలో థియేటర్లలో దౌర్జన్యం కాస్త ఎక్కువే ఉంటుంది. అస్సలు జవాబుదారీ తనం అన్నదే ఉండదు. అక్కడి జనాల సినిమా పిచ్చిని క్యాష్ చేసుకోవడాలని చూస్తుంటారు. బ్లాక్ టికెట్ల అమ్మకం బాగా ఎక్కువ. థియేటర్ల మెయింటైెనెన్స్ దారుణంగా ఉంటుంది. సేఫ్టీ ప్రికాషన్స్ కూడా సరిగా పాటించారు. ప్రేక్షకులకు రక్షణ, సదుపాయాలు కల్పించడాన్ని తేలిగ్గా తీసుకుంటారు.

ప్రేక్షకులంటే ఒక చులకన భావం ఉంటుంది. ఈ నేపథ్యంలో జగన్ సర్కారు థియేటర్ల మీద దాడులు చేయడం, నిబంధనలు పాటించని థియేటర్ల లైసెన్సులు రద్దు చేయడం సరైందే. కాకపోతే ఇందుకు ఎంచుకున్న టైమింగే తప్పు. ఏపీలో నిర్ణీత ధరలను మించి థియేటర్లలోనే రేట్లు పెంచి టికెట్లు అమ్ముతుంటారు. ప్రభుత్వం దీన్ని నియంత్రించకుండా మరీ అన్యాయంగా టికెట్ల రేట్లు తగ్గించేసింది. తర్వాత దీనిపై నియంత్రణ లేకపోవడంతో బ్లాక్ టికెట్ల దందా మరింత పెరిగిపోయింది.

పవన్ కళ్యాణ్ సినిమా ‘వకీల్ సాబ్’ రిలీజైనపుడే టికెట్ల రేట్లపై నియంత్రణ తేవడం ద్వారా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలా చేస్తున్న భావన కలిగించిన ప్రభుత్వం.. ఇప్పుడు థియేటర్ల యాజమాన్యాలు టికెట్ల ధరలపై కోర్టుకు వెళ్లిన సమయంలోనే వాటిపై దాడులు చేయడంతో ఇది కూడా ఆ కోవలోకే వస్తోంది. దీంతో ఈ చర్యలన్నీ ఇప్పుడే ఎందుకు చేపడుతున్నారు? జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పని ఎందుకు చేయలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందుకే ప్రభుత్వం చేస్తున్నది మంచి పనే అయినా జనాల నుంచి మద్దతు లభించట్లేదు. దేనికైనా టైమింగ్ ముఖ్యం అని జగన్ సర్కారు ఇప్పటికైనా అర్థం చేసుకుంటే మంచిది.