జ‌గ‌న్-కేసీఆర్‌ల‌కు గొప్ప ఇబ్బందే..

అటుఏపీ సీఎం జ‌గ‌న్‌.. ఇటు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఇద్ద‌రూ కూడా త‌మ పాల‌న అద్భుతంగా ఉంద‌ని.. త‌మ పాల‌న‌లో పేద‌వాళ్ల నుంచి ధ‌నికుల వ‌ర‌కు హ్యాపీగా ఉన్నార‌ని.. ప్ర‌భుత్వాలు పార‌ద‌ర్శ‌కంగా ప‌నిచేస్తున్నాయ‌ని ప‌దే ప‌దే చెబుతున్నారు. అంద‌రూ ఇదే నిజ‌మ‌ని అనుకుంటున్నారు కూడా. అయితే.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం వీరి పాల‌న అవినీతి కంపు కొడుతోంద‌ని.. స్ప‌ష్టంగా తెలుస్తోంది.

తాజాగా యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ (వైఏపీ) నిర్వహించిన సర్వేలో ఈ విష‌యం తేలింది. ఏపీలో 7 జిల్లాలు, తెలంగాణలో 30 జిల్లాల్లో నిర్వ‌హించిన స‌ర్వేలో.. అవినీతి వ్య‌వ‌హారాల‌పై ప్ర‌జ‌లు పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించారు. రెండు రాష్ట్రాల్లోనూ మొత్తం 21,523 మంది నుంచి అభిప్రాయాలను తీసుకున్న యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్షన్ సంస్థ‌.. ప్ర‌ధానంగా ప్ర‌భుత్వ‌సేవ‌ల‌పైనే ప్ర‌జ‌ల‌ను ప్ర‌శ్నించింది. ప్ర‌భుత్వాలు అనుస‌రిస్తున్న విధానాలు.. అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు.. వీటిలో జ‌రుగుతున్న అవినీతి గురించి ప్ర‌ధానంగా ప్ర‌శ్నించాయి.

దీంతో వాటిపై ప్ర‌జ‌లు కూడా చాలా నిర్మొహ‌మాటంగా త‌మ విష‌యాల‌ను వెల్ల‌డించారు. ప్రభుత్వ విభాగాల్లో అవినీతి ఉందని 90శాతం మంది.. లంచం ఇవ్వందే పనులు జరిగే పరిస్థితులు లేవని 89శాతం మంది.. కార్యాలయాల్లో అధికారుల తీరు అస్సలు బాగోలేదని 92శాతం మంది అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా రెవెన్యూ విభాగంలో 85శాతం మేర అవినీతి ఉందని అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత పోలీసు, రిజిస్ట్రేషన్‌, పురపాలక శాఖలో అవినీతి ఉందని చెప్పారు.

ఇరు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకుల్లో 80శాతం అవినీతి పరులేనని ప్రజలు తేల్చారు. అవినీతిపరులకు శిక్ష పడితేనే ఇతరులు భయపడతారని ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డ్డారు. తాము నిర్వర్తించాల్సిన విధులకు అధికారులు రేటు కడితే ఎలా అని ఎక్కువ మంది ప్ర‌జ‌లు ప్ర‌శ్నించారు. ఆదాయపు పన్ను వివరాలు ఆన్‌లైన్‌లో సమర్పిస్తున్న తరహాలో ఇతర విభాగాల్లోనూ సాంకేతిక సేవలు అందుబాటులోకి తీసుకురావాలనేది ప్ర‌జ‌ల ప‌ప్ర‌ధాన సూచ‌న. సో.. మ‌రి ఈ ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు.. ఏం చేస్తారో… చూడాలి.