కేసీఆర్ పై వార్… అమిత్ షా పవర్స్

తెలంగాణ రాజ‌కీయాలు మ‌రింత వేడెక్క‌నున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక మాదిరిగా సాగిన తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌,  ప్ర‌తిప‌క్షం బీజేపీ ల మ‌ధ్య రాజ‌కీయాలు.. మ‌రింత సెగ‌లు పొగ‌లు క‌క్క‌నున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి కార‌ణం.. ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం కేసీఆర్ విష‌యంలో చూచాయ‌గా.. చూస్తూ.. పోతున్న కేంద్రంలోని బీజేపీ నేత‌లు.. ఇప్పుడు ప‌ట్టు బిగించారు. “ఇక‌, మీరూ చెల‌రేగండి.“ అంటూ.. రాష్ట్ర బీజేపీ నేత‌ల‌కు ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చింది.

నిజానికి ఎవ‌రి గ్రీన్ సిగ్న‌ల్ లేకుండానే.. రెచ్చిపోతున్న బీజేపీ నాయ‌కులు.. ఇప్పుడు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డం ఇక‌, ముందు.. కేసీఆర్ వ‌ర్సెస్ బీజేపీ నేత‌ల మ‌ధ్య చండ్ర‌నిప్పులు చెల‌రేగ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా సీఎం కేసీఆర్‌పై యుద్ధం చేయాలని రాష్ట్ర‌ బీజేపీ నాయకులకు కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌షా సూచించారు. తాజాగా ఆయ‌న‌ ఢిల్లీలో బీజేపీ తెలంగాణ నేతలకు అమిత్‌షా దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన బియ్యం కుంభకోణాన్ని బయటపెట్టాలన్నారు. కేసీఆర్‌ అవినీతికి సంబంధించిన విషయాలను ప్రజలకు వివరించాలని సూచించారు. హుజురాబాద్ తరహాలోనే రాబోయే ఎన్నికల్లో గెలవాలని నాయకులకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా మీరు చేయాల్సింది మీరు చేయండి.. ప్రభుత్వపరంగా ఏం చేయాలో తమకు వదిలేయాలని ఆయన పేర్కొన్నారు. ఇకపై తెలంగాణలో తరచూ పర్యటిస్తానని నాయకులకు అమిత్‌షా హామీ ఇచ్చారు.

సో.. దీనిని బ‌ట్టి.. కేంద్రంలో బీజేపీ నాయ‌కులు కేసీఆర్‌పై యుద్ధ‌మే చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు  స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇటీవ‌ల కాలంంలో కేంద్రాన్ని దుయ్య‌బ‌ట్ట‌డం.. కేంద్రంపై విమ‌ర్శ‌లు చేయ‌డం.. కేంద్ర మంత్రిని దూషించ‌డం..చేస్తున్న కేసీఆర్ అండ్ కో పై కేంద్ర ప్ర‌భుత్వం కూడా సీరియ‌స్‌గానే ఉంది. ఇప్ప‌టికే ఒక‌టికి రెండు సార్లు.. బియ్యం, ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర మంత్రులు ఇద్ద‌రు ముగ్గురు వివ‌ర‌ణ ఇచ్చారు.అ యిన‌ప్ప‌టికీ.. కేసీఆర్‌.. మాత్రం త‌న ధోర‌ణిలోనే పోతున్నారు.. కేంద్రంలోని బీజేపీ అన్యాయం చేస్తోంద‌ని ఫోక‌స్ చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో రాష్ట్రంలో ఏం జ‌రుగుతోంద‌నే విష‌యంపై నివేదిక‌లు తెప్పించుకున్న కేంద్ర బీజేపీ నేత‌లు.. ఇప్పుడు చాలా సీరియ‌స్ అవ్వాల‌నే సందేశాన్ని పంపించారు. దీంతో ఇక నుంచి రోజుకో విమ‌ర్శ పూట‌కో దూష‌ణ‌లు ష‌రా మామూలుగా మార‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏదేమైనా.. కేంద్రం వ్యూహం చూస్తే.. తెలంగాణ‌లో రాజ‌కీయ ర‌ణ‌రంగం ఖాయ‌మ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.