రాధాకు టికెట్ కన్ఫర్మ్?

వంగవీటి రాధాకృష్ణకు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇప్పుడే టికెట్ కన్ఫర్మ్ చేశారా ? అవుననే పార్టీలో ప్రచారం జరుగుతోంది. విజయవాడలోని తూర్పు నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో రాధా పోటీ చేయబోతున్నట్లు చెబుతున్నారు. రాధా దృష్టంతా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మీదే ఉంది. అయితే సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు అవకాశం రావడం లేదు. దాంతో రాధా కూడా సమాధానపడిపోయినట్లు సమాచారం.

అప్పుడెప్పుడో చాలాకాలం క్రితం సెంట్రల్ నుంచి రాధా కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి పోటీ చేయటమే కానీ గెలిచింది లేదు. దానికి తోడు రాధా జనాల్లో తిరగటం కూడా తక్కువే. అవసరమైనప్పుడు మాత్రం కనిపించి మళ్ళీ మాయమైపోతారనే ఆపవాదుంది. అందుకనే వంగవీటి రంగా వారసుడనే మంచి ప్లాట్ ఫామ్ ఉన్నా రాజకీయాల్లో పెద్దగా రాణించలేకపోయారు. కేవలం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టికెట్ దక్కలేదన్న కారణంగానే వైసీపీని వదిలిపెట్టి టీడీపీలో చేరారు.

పోనీ టీడీపీలో అయినా టికెట్ దక్కిందా అంటే అదీలేదు. సరే చరిత్రలో నుండి భవిష్యత్తులోకి మారితే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పోటీ చేయాలని రాధాకు చంద్రబాబు చెప్పారని ప్రచారం మొదలైంది. అంటే రాబోయే ఎన్నికల్లో కూడా సెంట్రల్ నుండి రాధాకు ఛాన్సు లేనట్లే. ప్రస్తుతం సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ ఉన్న కారణంగా రాధాకు అవకాశం రావటం లేదు.

ఇక వైసీపీ విషయానికి వస్తే విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి దేవినేని అవినాష్ పోటీ చేయటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే రాధా వర్సెస్ అవినాష్ పోటీ ఉండచ్చు. అవినాష్ వ్యవహారం రాధాకు పూర్తిగా విరుద్ధం. ఎందుకంటే అవినాష్ 24 గంటలూ జనాల్లోనే ఉంటారు. వర్షం వచ్చినా, వరదొచ్చినా, కరోనా వైరస్ సమయంలో కూడా అవినాష్ జనాల్లోనే తిరిగారు. పార్టీలోనే కాకుండా జనాల్లో కూడా మంచి పట్టున్న యువనేతగా అవినాష్ కు పేరుంది. కాకపోతే గుంటూరు కృష్ణా జిల్లాల్లో వైకాపాకు ఈసారి రాజధాని దెబ్బ భారీగా పడనుంది. పైగా రాధా కుటుంబం అంత పాపులారిటీ అవినాష్ కు వ్యక్తిగతంగా లేదు. మొత్తం మీద రాబోయే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా ఉండే అవకాశముంది.