డీఎస్‌కు .. కాంగ్రెస్ ఎస్

తెలంగాణలో సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు టీఆర్ఎస్ రాజ్య‌స‌భ్యుడు ధ‌ర్మ‌పురి శ్రీనివాస్ (డీఎస్‌) తిరిగి సొంత‌గూటికి చేరుతున్నారు. ఎంతో కాలంగా వినిపిస్తున్న ఊహాగానాల‌ను నిజం చేస్తూ ఆయ‌న మ‌ళ్లీ కాంగ్రెస్ కండువా క‌ప్పుకోనున్నారు. అందుకు రంగం సిద్ధ‌మైంది. తాజాగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీని క‌లిసిన డీఎస్ పార్టీలో తిరిగి చేరే విష‌యంపై చర్చ‌లు జ‌రిపారు. సోనియా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఆయ‌న మ‌ళ్లీ హ‌స్తం పార్టీలో చేర‌డం ఖాయ‌మైంది. ఈ మేర‌కు తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌కు ఢిల్లీ నుంచి పిలుపు వ‌చ్చింది.

రేవంత్ వ్యూహం
డీఎస్‌ను తిరిగి కాంగ్రెస్‌లోకి ర‌ప్పించ‌డంలో రేవంత్ కీల‌క పాత్ర పోషించార‌ని స‌మాచారం. టీపీసీసీ అధ్య‌క్షుడ‌య్యాక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బ‌లోపేతంపై రేవంత్ ప్ర‌త్యేక దృష్టి సారించారు. అధికార టీఆర్ఎస్ ప్ర‌భుత్వం, సీఎం కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు చేస్తూ త‌మ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని తీసుకు వ‌స్తున్నారు.  ఈ నేప‌థ్యంలో గ‌తంలో పార్టీని వ‌దిలి వెళ్లిన సీనియ‌ర్ నాయ‌కుల‌ను తిరిగి తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే డీఎస్‌ను తిరిగి కాంగ్రెస్ గూటికి చేర్చారు. అయితే ఇక్క‌డ డీఎస్ త‌న‌యుడు సంజ‌య్‌పై రేవంత్ ఎక్కువ ఆస‌క్తి చూపిస్టున్న‌ట్లు స‌మాచారం. ఆయ‌న్ని పార్టీలో చేర్చుకునే విష‌యంపై నిజామాబాద్ కాంగ్రెస్ నేత‌ల నుంచి వ్య‌తిరేక‌త వ‌చ్చింది. దీంతో ముందుగా సంజ‌య్ తండ్రి డీఎస్‌ను పార్టీలోకి తీసుకుంటే.. ఆ త‌ర్వాత ఎలాగైనా సంజ‌య్‌ను తీసుకు రావ‌చ్చ‌నేది రేవంత్ ప్ర‌ణాళిక‌గా తెలిసింది.

ఎలా వాడుకుంటారో
ప్ర‌స్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సీనియ‌ర్లే స‌మ‌స్య‌గా మారార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. రేవంత్‌కు వాళ్లు అడ్డుప‌డుతున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌రో పాత కాపు డీఎస్‌ను ఇప్పుడు పార్టీలోకి చేర్చుకుని ఆయ‌న‌కు ఎలాంటి బాధ్య‌త‌లు అప్ప‌గిస్తారోన‌న్న సందేహం క‌లుగుతోంది. మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ రాజ‌కీయంగా ఎదిగిన డీఎస్ రాష్ట్ర మంత్రిగా, ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ పీసీసీ అధ్య‌క్షుడిగా ప‌నిచేశారు.

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత టీఆర్ఎస్‌లో చేరిన ఆయ‌న్ని కేసీఆర్ 2016లో రాజ్య‌స‌భ‌కు పంపించారు. ఆయ‌న ప‌ద‌వీకాలం వ‌చ్చే ఏడాది జూన్ వ‌ర‌కూ ఉంది. కానీ డీఎస్ పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నార‌ని గ‌తంలో నిజామాబాద్ ఎంపీగా ఉన్న క‌విత స‌హా ఆ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్ర‌జా ప్ర‌తినిధులు కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. అప్ప‌టి నుంచి డీఎస్‌కు, టీఆర్ఎస్‌కు దూరం పెరిగింది. 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో క‌విత‌పై ఆయ‌న కుమారుడు అర‌వింద్ గెల‌వ‌డంతో ఆ దూరం మ‌రింత ఎక్కువైంది. దీంతో ఆయ‌న టీఆర్ఎస్‌ను వ‌దిలి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు.