ఉద్యమ సెగతో మంటెక్కినట్లే ఉంది

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిస్థితి చూస్తుంటే ఈ విషయం బాగా అర్థమైపోతోంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు ఆందోళన మొదలుపెట్టినప్పుడు మోడీ అసలు లెక్కేచేయలేదు. ఆందోళన ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలకు పాకినపుడు కూడా మీరేమన్నా చేసుకోండి పట్టించుకునేదే లేదన్నట్లుగా వ్యవహరించారు. చివరకు ఆందోళన కాస్త రైతు సంఘాలంతా కలిసిపోయి ఉద్యమరూపం దాల్చినపుడు కూడా ఏమాత్రం లెక్క చేయలేదు.

చివరకు రైతు ఉద్యమం హింసాత్మకంగా మారినపుడు కూడా వెనక్కు తగ్గేదే లేదన్నారు. అలాంటి మోడీ హఠాత్తుగా ఎందుకని వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. చట్టాలను రద్దు చేయటమే కాదు రైతాంగానికి క్షమాపణలు కూడా చెప్పుకున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే తాజాగా రైతు సంఘాల ప్రతి డిమాండ్ ను అంగీకరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది. రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లు రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

నిరసన కార్యక్రమాల్లో చనిపోయిన రైతుకుటుంబాలకు నష్టపరిహారం అందించేందుకు హర్యానా, యూపీ ప్రభుత్వాలు అంగీకరించాయి. పంటలకు కనీస మద్దతు ధరలను చట్టం రూపంలో తెచ్చేందుకు కూడా కేంద్రం అంగీకరించింది. దీనికి సంప్రదింపుల కోసం వేసిన కమిటిలో భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులకు చోటు కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. విద్యుత్ సంస్కరణల్లో భాగంగా వ్యవసాయ విద్యుత్ కు మీటర్లు బిగించే అంశంపై సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు సంబంధిత వర్గాలందరితోను చర్చించిన తర్వాతే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడతామని కేంద్రం హామీ ఇచ్చింది.

ఇలా రైతు సంఘాల ప్రతి డిమాండ్ ను కేంద్రం అంగీకరించటంతోనే ఉద్యమ సెగ మోడీకి ఏ స్థాయిలో మంటపుట్టించిందో అర్థమైపోతోంది. రైతు సంఘాల డిమాండ్లకు మోడీ సాంతం అంగీకరించటానికి ప్రధాన కారణం రాబోయే అసెంబ్లీ ఎన్నికలే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మధ్యనే జరిగిన 29 అసెంబ్లీ, మూడు పార్లమెంటు ఉపఎన్నికల్లో బీజేపీకి పెద్ద దెబ్బ పడింది. ఇదే పరిస్థితి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కంటిన్యూ అయితే 2024 పార్లమెంటు ఎన్నికల్లో ప్రభావం చూపుతుందన్న భయమే చివరకు మోడిని సాంతం దిగొచ్చేట్లు చేసింది. ప్రభుత్వాలపై  ఉద్యమ సెగ ఎలాగుండాలో రైతు సంఘాల ఉద్యమం చాటిచెప్పింది.