ముందే చెప్పా.. జ‌గ‌న్ వ‌స్తే ఇంతే: KA పాల్

కేఏ పాల్ గుర్తున్నారా?  గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జాశాంతి పార్టీ త‌ర‌ఫున అభ్య‌ర్థుల‌ను నిల‌బ‌డుతున్నాన‌ని.. చంద్ర‌బాబును, జ‌గ‌న్‌ను కూడా ఓడించి ఏపీలో అధికారంలోకి వ‌స్తాన‌ని.. ప‌దే ప‌దే చెబుతూ.. మీడియా ముందుకు వ‌చ్చిన కేఏ పాల్‌.. ఎన్నిక‌ల‌ త‌ర్వాత‌.. అడ్ర‌స్ లేకుండా పోయారు. అయితే.. త‌ర‌చుగా ఆయ‌న జూమ్ ద్వారానో.. ఆన్‌లైన్ ద్వారానో.. యూట్యూబ్ ద్వారానో.. త‌న అభిప్రాయాలు వెల్ల‌డిస్తున్నారు. మీడియా డిబేట్‌ల‌లోనూ ఆయ‌న త‌న గ‌ళం వినిపిస్తున్నారు. తాజాగా ఒక చానెల్ డిబేట్‌లో పాల్గొన్న కేఏ పాల్‌.. ఏపీ సీఎం జ‌గ‌న్‌పైనా.. రాష్ట్ర అప్పులపైనా.. ముఖ్యంగా అమ‌రావ‌తి రాజ‌ధాని.. ప్ర‌జ‌ల ఉదాసీన వైఖ‌రిపైనా పాల్ నిప్పులు చెరిగారు.

నేను ముందే చెప్పా!

ప్ర‌స్తుతం రాష్ట్రంలో అరాచ‌క పాల‌న సాగుతోంది. సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసే స‌మ‌యంలో ఆరు మాసాల్లోనే తాను మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాన‌ని చెప్పిన జ‌గ‌న్‌.. రెండున్నరేళ్ల కాలంలో అత్యంత వ‌రెస్ట్ సీఎంగా పేరు తెచ్చుకున్నార‌ని.. గ‌తంలో ముఖ్య‌మంత్రులుగా ప‌నిచేసిన ఆయ‌న తండ్రి వైఎస్ కానీ.. ఇత‌రులు కానీ.. ఇలా బ్యాడ్ నేమ్‌నుతెచ్చుకోలేద‌ని తెలిపారు. ఎన్నిక‌ల‌కు ముందు కూడా తాను ఈ విష‌యాన్ని చెప్పాన‌న్నారు. జ‌గ‌న్ వంటి అరాచ‌క వాది అధికారంలోకి వ‌స్తే.. రాష్ట్ర నాశ‌నం అవుతుంద‌ని నెత్తీనోరూ కొట్టుకున్నాన‌ని.. అయినా.. ఎవ‌రూ విన‌లేద‌ని.. పాల్ వ్యాఖ్యానించారు.

అప్పులే త‌ప్ప అభివృద్ధి ఏదీ?

రాష్ట్రంలో అప్పులే త‌ప్ప అభివృద్ది క‌నిపించ‌డం లేద‌ని ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షులు పాల్ విరుచుకుప‌డ్డారు. గ‌త 5 నుంచి 10 ఏళ్ల‌లో చేసిన అప్పును.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఒక్క ఏడాదిలో చేసింద‌ని.. ఇది రాష్ట్రానికి అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్ర‌తి నెలా 8 నుంచి 10 వేల కోట్లు అప్పులు చేస్తున్నార‌ని.. అన్న ఆయ‌న ఇలా ఎన్నాళ్లు చేస్తార‌ని నిల‌దీశారు. పోనీ.. అప్పులు  చేసినా.. అభివృద్ధి ఎక్క‌డైనా క‌నిపిస్తోందా? అంటే బూత‌ద్దంలో వెతికినా క‌నిపించ‌డం లేద‌న్నారు.

ఎంపీలు.. ఎమ్మెల్యేలు కూడా బాధ‌ప‌డుతున్నారు

వైసీపీ ప్ర‌భుత్వ అధినేత సీఎం జ‌గ‌న్ తీసుకుంటున్నే నిర్ణ‌యాలు.. చేస్తున్న అప్పుల‌కు స‌మాధానం చెప్ప‌లేక‌..వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా మ‌ధ‌న ప‌డుతున్నార‌ని.. చాలా మంది త‌న‌కు ఈ విష‌యాన్ని కూడా చెప్పార‌ని పాల్ అన్నారు. పైకి ఏమీ అన‌లేక వారిలో వారే న‌లిగిపోతున్నార‌ని చెప్పారు. 22 మంది ఎంపీలు ఉండి కూడా కేంద్రాన్ని ప్ర‌శ్నించ‌లేని ప‌రిస్థితి ఎందుకు వ‌చ్చింద‌న్నారు. త‌న‌పై ఉన్న 32 సీబీఐ కేసుల‌కు జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నార‌ని అన్నారు. ఈ విష‌యాన్ని కూడా తాను ఎన్నిక‌ల‌కు ముందు చెప్పాన‌ని.. కేసులు ఉన్న వ్య‌క్తిని సీఎం చేస్తే.. ఇలానే ఉంటుంద‌ని అన్నాన‌ని.. అయితే.. అప్పుడు త‌న మాట ఎవ‌రూ వినిపించుకోలేద‌న్నారు.

అమ‌రావ‌తిని చంపేశారు!

పాడి కుండ వంటి అమ‌రావ‌తిని జ‌గ‌న్ చంపేశార‌ని.. పాల్ అన్నారు. అమ‌రావ‌తి డెవ‌ల‌ప్ అయితే.. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబ‌డులు వ‌స్తాయ‌ని.. తాము అనుకున్నామ‌ని పాల్ చెప్పారు. అయితే.. జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల పేరుతో అటు ఉత్త‌రాంధ్ర‌, ఇటు క‌ర్నూలు ప్ర‌జ‌ల‌ను కూడా ముంచేశార‌ని.. పాడికుండ వంటి అమ‌రావ‌తిని మొగ్గ‌లోనే నాశ‌నం చేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మూడు రాజ‌ధానులు తెస్తామ‌ని.. ప్ర‌తి జిల్లా హెడ్ క్వార్ట‌ర్ను స్మార్ట్ సిటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌.. ఇప్ప‌డు ఏం చేస్తున్నార‌ని.. నిల‌దీశారు. మూడు బిల్లుల‌ను ఉప‌సంహ‌రించుకున్న స‌మ‌యంలో తాను సంతోషించాన‌ని చెప్పిన పాల్‌.. మ‌ళ్లీ కొత్త బిల్లు తెస్తామ‌నడంతో నీరుగారి పోయిన‌ట్టు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ప్ర‌జ‌ల‌ది కూడా త‌ప్పు!

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో తాము చెప్పిన మాట‌ల‌ను ప్ర‌జ‌లు లైట్ తీసుకున్నార‌ని అన్న పాల్.. ఓటును 2000, 5000 ల‌కు అమ్ముకుని ప్ర‌జ‌లు పెద్ద త‌ప్పు చేశార‌ని విమ‌ర్శించారు. ప్ర‌జ‌లు త‌మ విలువైన ఓటును ఇలా అమ్ముకుంటే.. ఇలాంటి వారే అధికారంలోకి వ‌స్తార‌ని.. చెప్పారు. ప్ర‌జ‌లు ఇప్ప‌టికైనా.. త‌మ మ‌న‌సులోని ఆవేద‌న‌ను జ‌గ‌న్‌కు వినిపించేలా సోష‌ల్ మీడియా ద్వారా..  నినాదాలు పంపాల‌ని.. పాల్ పిలుపునిచ్చారు.