ట్రూ అప్ చార్జీలపై యూటర్న్

ఆంధ్రప్రదేశ్ లో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై కొంతకాలంగా తీవ్ర చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబానికి కూడా నెలకు దాదాపు వెయ్యి రూపాయల కరెంటు బిల్లు రావడంతో జనానికి షాక్ తగిలినట్లయింది. ఇలా హఠాత్తుగా కరెంటు బిల్లు ముట్టుకుంటేనే షాక్ ఎందుకు కొడుతోందని అడిగితే…ట్రూ ఆప్ ఛార్జీలంటూ ఏపీ ప్రభుత్వం చేతులు దులుపుకుంది. దీంతో, తడిసి మోపెడవుతున్న కరెంటు బిల్లులు కట్టలేక…చేసేదేమీ లేక జనం నానా తిప్పలు పడ్డారు.

ఈ వ్యవహారంలో జగన్ సర్కార్ పై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే తాజాగా విద్యుత్‌ వినియోగదారులకు ఏపీఈఆర్ సీ ఊరటనిచ్చింది. ట్రూఅప్‌ ఛార్జీల కింద సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో వసూలు చేసిన మొత్తాన్ని వినియోగదారులకు తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించింది. నవంబర్‌లో వాడుకున్న విద్యుత్ కు సంబంధించి డిసెంబరులో ఇస్తున్న బిల్లులో ఆ చార్జీలను సర్దుబాటు చేస్తున్నారు. తాజాగా వినియోగదారులకు ఇస్తున్న విద్యుత్‌ బిల్లులలో ఈ విషయం వెల్లడైంది.

వాస్తవానికి, గత రెండు నెలలుగా కరెంటు బిల్లుల మోత మోగుతోందంటూ వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. 2014–15 నుంచి 2018–19 మధ్యకాలానికి రూ.7,224 కోట్ల ట్రూ అప్‌ ఛార్జీల పిటిషన్లను విద్యుత్ సంస్థలు దాఖలు చేశారు. దీంతో, 2020 ఆగష్టు 27న రూ.3,669 కోట్ల ట్రూ అప్ ఛార్జీల వసూలుకు ఏపీఈఆర్‌సీ అనుమతినిచ్చింది. ఈ క్రమంలోనే ఏపీఎస్పీడీసీఎల్‌ రూ.3,060 కోట్లు, ఏపీఈపీడీసీఎల్‌ రూ.609 కోట్ల మొత్తాన్ని 8 నెలల్లో వసూలు చేయాలని నిర్ణయించుకున్నాయి.

మొదటి రెండు నెలల్లో భాగంగా సెప్టెంబర్, అక్టోబర్‌ బిల్లులలో ట్రూ ఆప్ చార్జీలను బిల్లులో వడ్డించారు. అయితే, ఈ వ్యవహారంపై న్యాయపరమైన చిక్కులు రావడంతో ఏపీఈఆర్‌సీ వెనక్కి తగ్గింది. ఈ క్రమంలోనే తాజాగా నవంబరు నెల బిల్లులో ట్రూఅప్‌ ఛార్జీలను కలపలేదు. అంతేకాదు, ఆ రెండు నెలలకు వసూలు చేసిన ట్రూ అప్ చార్జీలను కూడా నవంబర్‌ నెల బిల్లు నుంచి వెనక్కి చెల్లిస్తూ సర్దుబాటు చేస్తున్నారు. దీంతో, వినియోగదారులకు ఊరట లభించింది.