పోసాని అంటే అంతే మ‌రి…కేటీఆర్‌, రేవంత్, బాల‌య్య‌ను ఓ రేంజ్‌లో….

Posani

ప్ర‌ముఖ సినీన‌టుడు కం రాజ‌కీయ‌వేత్త కూడా అయిన పోసాని కృష్ణ మురళి సుదీర్ఘ కాలం త‌ర్వాత మీడియా ముందుకు వ‌చ్చారు. ఆస‌క్తిక‌ర‌మైన న‌ట‌న‌కు పెట్టింది పేర‌యిన పోసాని త‌న విలేక‌రుల స‌మావేశంలోనూ అదే రీతిలో ఆస‌క్తిని సృష్టిస్తుంటారు. తాజాగా విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడిన ఆయ‌న ప్ర‌ముఖ సినీన‌టులు రాజ‌కీయ‌వేత్త‌ల విష‌యంలోనూ ఓ రేంజ్‌లో కామెంట్ చేశారు.

ఓ వ్యక్తిని విమర్శించడానికి లేదా మరో వ్యక్తిని పొగడటానికి తాను ప్రెస్ మీట్ పెట్టలేదని చెప్పిన పోసా‌ని ఈ సంద‌ర్భంగా అంద‌రినీ ఆ లెక్క‌లోకి లాగారు. ఎన్టీఆర్ సీఎం కావడానికి ..ఆయన నిజాయితీ ఒక్కటే కార‌ణం కాదని ఈనాడు పేపర్ కూడా కార‌ణ‌మేన‌ని విశ్లేషించారు. ప్ర‌స్తుతం కూడా ఎన్టీఆర్ లాంటి ప్రజా సేవకులు ఉన్నారని తెలిపారు.

గ‌త రెండు మూడు రోజులుగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ నేత‌ రేవంత్ రెడ్డి అనేక విమర్శలు చేస్తున్నారని పోసాని పేర్కొన్నారు. “ఎన్జీటీ దర్యాప్తుకు ఆదేశిస్తే… మంత్రి పదవికి రాజీనామా చేయమనడం ఏంటీ..ఇది ఎక్కడి లాజిక్ నాకు అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి 50 లక్షలు లంచం ఇస్తూ పట్టుబడ్డ వ్యక్తి.. ఈరోజుల్లో ఇలా దొరికిన వ్యక్తి ఎవరూ లేరు.! ఇలాంటి వ్యక్తి.. కేటీఆర్‌ను రాజీనామా చేయమనడం ఏంటీ? మంచి రాజకీయ నాయకుని పై బురదజల్లడం ఏంటి? కేటీఆర్, హరీష్ రావు నిజాయితీప‌రులైన రాజ‌కీయ‌నాయ‌కులు. వీళ్ళే భవిష్యత్ తెలంగాణకు రెండు కళ్ళ లాంటి వారు. ఎక్కడ ఎలా ఉండాలో కేటీఆర్ కు భాగా తెలుసు. కేటీఆర్ చాలా మంచివాడు… ప్రతిపక్షాల ఆరోపణలు నమ్మకండి.. కేటీఆర్ అవినీతిని ప్రతిపక్ష నాయకులు ప్రూవ్ చేస్తే…రేపటి నుంచి టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా తెలంగాణ మొత్తం తిరుగుతా…” అని పోసానని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయితే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని పోసాని పేర్కొన్నారు. “ఇంత మంచి ప్రాజెక్ట్ కడితే కమీషన్ల కోసం అని ప్రతిపక్షాలు విమర్శించడం ఏంటీ? ఉత్తమ్ కుమార్ రెడ్డి ,జానారెడ్డి లాంటి వారు విమర్శించే ముందు ఆలోచించాలి.

కాంగ్రెస్ నేతలు అద్దంలో వాళ్ల మొహం వాళ్లు చూసుకొని మాట్లాడాలి. నాగార్జున సాగర్ కాంగ్రెస్ ప్రజలకోసమే కడితే కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా ప్రజల కోసమే కట్టారు. ప్రతిపక్ష నాయకులు ప్రజల్లో ఉంటే.. ఏం జరుగుతుందో… ఏపీ సీఎం జగన్‌ను చూస్తే తెలుస్తుంది.` అని చుర‌క అంటించారు.

టీఆర్ఎస్‌ను ఓడించాలని రాజకీయాలు చేస్తే..ఎప్పటికి ప్రతిపక్షంలోనే ఉంటారని పోసాని అన్నారు. “కేసీఆర్ ఎక్కడ ఉన్నాడన్నది మనకు అనవసరం. ప్రజలకు సేవ చేస్తున్నాడా లేదా అన్నది ముఖ్యం. మీడియాకు ఒకప్పుడు ప్రజలే ప్రయారిటీ.. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కూర్చొని సమస్యలు పరిష్కరించుకుంటున్నారు. ఏపీలో ప్రతిపక్షం అసత్యాలతో రైతు లను గందరగోళానికి గురిచేస్తారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య మంచి స్నేహం ఉంది…కేసీఆర్ చెప్తే జగన్ వింటాడు…జగన్ రిక్వెస్ట్ చేస్తే..కేసీఆర్ ఆలోచిస్తాడు. పోతిరెడ్డిపాడు అంశాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు పరిష్కరించుకుంటారు” అని తెలిపారు.

బాలకృష్ణ కోపంగా మాట్లాడినా…విమర్శించినా…తిట్టినా…ఒక నిమిషమేన‌ని పోసాని అ‌న్నారు. బాలకృష్ణ హానెస్ట్ ఫెలో…సంపాదన కోసం రాజకియాల్లోకి రాలేదు. బాలకృష్ణ కోపం సమాజానికి నష్టమేమి కాదు. ఏపీ సీఎం ఎన్టీఆర్ కాదు పొడిపించుకోవడానికి ….జగన్…ఆయన పొడవడు..పొడిపించుకోడు అని తెలిపారు. కాగా, హైద‌రాబాద్‌లో మృతి చెందిన‌ జర్నలిస్ట్ మనోజ్ మృతికి చింతిస్తున్నాన‌ని పోసాని కృష్ణ‌ముర‌ళి తెలిపారు. త‌న తరుపున 25 వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాన‌ని వెల్ల‌డించారు. సినిమా షూటింగ్ ప్రారంభ‌మయితే మళ్ళీ 25వేలు సహాయం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. మీడియా ప్రజలందరికీ సర్వీస్ చేసే రంగమ‌ని పేర్కొన్న ఆయ‌న సినిమా పరిశ్రమ కూడా మనోజ్ కుటుంబానికి సహాయం చేయాలని కోరారు.