కేసీఆర్‌పై ఎంపీ అర్వింద్‌.. హాట్ కామెంట్స్‌.. ఫుల్ ఫైర్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ .. బీజేపీ నేత‌ల‌పై ఏ రేంజ్‌లో విమ‌ర్శలు గుప్పిస్తున్నారో.. అదే రేంజ్‌లో బీజేపీ నాయ‌కులు కూడా ఫైర‌వుతున్నారు. తాజాగా నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ .. కేసీఆర్‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. కేసీఆర్‌. సోమ‌రి.. తిండిపోతు.. మొద్రు నిద్ర పోతున్నాడు.. అంటూ.. ఆయ‌న నిప్పులు చెరిగారు. ఉప్పుడు బియ్యాన్ని క్రమంగా తగ్గించాలని నాలుగేళ్ల నుంచి ఎఫ్సీఐ చెబుతున్నా.. సీఎం కేసీఆర్‌ సోమరితనంతో వ్యవహరించారని   అర్వింద్‌ తెలిపారు.

రాష్ట్రం ఏర్పడిన నుంచి ఏ ప్రత్యామ్నాయ పంటను ప్రోత్సహించలేదని… అందరూ వరి వేయాలని చెప్పా రని ఆయ‌న‌ విమర్శించారు. రీసైక్లింగ్‌ బియ్యం ఎఫ్సీఐకి ఇస్తూ… మంచి బియ్యాన్ని బయట అమ్ముతున్న మిల్లర్లకు.. కేసీఆర్‌, కేటీఆర్‌ సహకరిస్తున్నారని అర్వింద్‌ ఆరోపించారు. గిరిజన వర్సిటీకి రాష్ట్రమే స్థలం కేటాయించట్లేదని అన్నారు. “ఎఫ్సీఐకి వీళ్లు తెలంగాణలో పండే పంట తక్కువ ఇస్తున్నారు. రీసైక్లింగ్ బియ్యం ఎక్కువ ఇస్తున్నారు. టీఆర్ ఎస్‌ నేతలు బియ్యం స్మగ్లింగ్‌తో వేల కోట్లు ఆర్జిస్తున్నారు. అధికార పార్టీ అండతో మిల్లర్లు రైతులకు అన్యాయం చేస్తున్నారు. కర్నాటక, రాయచూర్, సిరుగప్ప, బళ్లారిలో పండే లో క్వాలిటీ పంటను తీసుకొచ్చి బాయిల్డ్ చేసి ఎఫ్సీఐకి అప్పజెప్పుతున్నారు“ అని విమ‌ర్శ‌లు గుప్పించారు.

“తెలంగాణ సోనా అనే మనకు పండే మంచి పంటను ప్రైవేటుగా రూ.40కి అమ్ముతున్నారు. వరి ప్రైమరీ క్రాప్. మోస్ట్ ఇంపార్టెంట్ క్రాప్. మరి తెలంగాణ తల్లి చేతిలో మక్క ఎందుకు పెట్టిన్రు. మక్క ఎందుకు కొంటలేరు? అప్పట్లో అందర్నీ వరి వేయమన్నారు. 2014 నుంచి ఏ పంటకు బోనస్ ఇచ్చారు? ఏ పంటను ఎంకరేజ్ చేశారు? ఏ కొత్త వెరైటీని తెలంగాణలో తీసుకొచ్చారు? ఏ రైతును కాపాడారు?“ అని ప్ర‌శ్నించారు.

కేసీఆర్ మింగుడుకు రైతులు బలి అవుతున్నారని   వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్.. ముఖ్యమంత్రి మాస్క్‌ వేసుకున్న స్మగ్లర్ అని ఎంపీ దుయ్యబట్టారు. కిషన్‌రెడ్డి, పియూష్‌గోయల్‌పై కేసీఆర్ వాడిన భాష సరికాదన్నారు. తెలంగాణలో భూముల ధరలు పెరగడంలో కేసీఆర్ గొప్పతనం లేదని… అలాంటప్పుడు ప్రభుత్వ భూములు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రెస్ మీట్ చూస్తే చెవులు మూసుకోవాల్సి వస్తుందన్నారు. రైతులు పండించిన పంటలపై కూడా కేసీఆర్ స్మగ్లింగ్ చేస్తున్నారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు.