కేసీఆర్ వ్యూహం.. మ‌ళ్లీ పార్ల‌మెంటు ద‌ద్ద‌రిల్లాలె!

రాష్ట్ర ప్రయోజనాలు, రైతాంగ ప్రయోజనాల కోసం ఎంత వరకైనా వెళ్లాలని, పార్లమెంట్ సమావేశాల్లో బలంగా వాణి వినిపించాలని టీఆర్ ఎస్‌ ఎంపీలకు ఆ పార్టీ అధినేత‌, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. సోమవారం నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కేసీఆర్… ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా ధాన్యం కొనుగోళ్లు, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది.

ధాన్యం కొనుగోళ్ల విధానం, కేంద్రం అనుసరిస్తున్న తీరు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో జరిపిన చర్చల వివరాలు… తదితరాలపై భేటీలో చర్చ జరిగింది. ఈ సంద‌ర్భంగా ఎంపీలు ఎక్క‌డా త‌గ్గాల్సిన అవ‌స‌రం లేద‌ని.. కేంద్రంపై కోట్లాడాల‌ని కేసీఆర్ సూచించారు.

ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్… పంటల కొనుగోలుకు సంబంధించి జాతీయ విధానం రావాల్సిన అవసరం ఉందని అన్నారు. పంటలకు కనీస మద్దతు ధర చట్టం, విద్యుత్ చట్టాల రద్దు కోసం పోరాడాలని ఎంపీలకు సూచించారు. కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా కోసం పట్టుబట్టాలని, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటి విషయమై ప్రశ్నించాలని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్న ముఖ్యమంత్రి… కేంద్రం తెలంగాణకు ప్రత్యేకంగా చేసిందేమీ లేదని అన్నారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతవరకైనా పోవాలన్న ఆయన… పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ, స‌హా పార్టీ వాణి బలంగా వినిపించాలని ఎంపీలకు తెలిపారు. కేంద్రం నుంచి తెలంగాణకు ఎలాంటి సహకారం లేదని విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దన్నారు. ధాన్యం కొనుగోళ్లు,. విద్యుత్‌ చట్టాల ఉపసంహరణ.. విద్యుత్‌ మీటర్లపై కేంద్రాన్ని పార్లమెంటులో నిలదీయాలని కేసీఆర్‌ సూచించారు. అదేస‌మ‌యంలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని ఎండగడుతూ పార్లమెంట్లో తీవ్ర నిరసనలు వ్యక్తం చేయాలని టీఆర్ ఎస్‌ భావిస్తోంది. వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా తెలంగాణ సహా దేశవ్యాప్తంగా రైతుల సమస్యలు, ధాన్యం సేకరణపై సమగ్రవిధానం వంటి వాటిని ప్రస్తావించే వీలుంది.