ఇంత రాద్దాంతం అవసరమా వైసీపీ?

ఒక చిన్న మున్సిపాలిటి విషయంలో ప్రభుత్వం, అధికారపార్టీ అనవసరంగా గబ్బుపడుతోంది. కృష్ణాజిల్లాలోని కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ పదవిని అందుకునే విషయంలో అధికార పార్టీ అనుసరిస్తున్న విధానం ఎంతమాత్రం సరికాదు. 29 వార్డులున్న కొండపల్లి మున్సిపాలిటిలో వైసీపీ-టీడీపీలకు చెరో 14 వార్డులు దక్కాయి. ఇండిపెండెంట్ గా గెలిచిన ఒక కౌన్సిలర్ టీడీపీకి మద్దతుగా నిలబడ్డారు. ఇదికాకుండా విజయవాడ ఎంపీ కేశినేని నాని, రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కూడా కొండపల్లి మున్సిపాలిటిలో కో ఆప్టెడ్ సభ్యునిగా ఓటు హక్కును నమోదు చేసుకున్నారు.

ఎంపీ కేశినేని నాని ఓటు హక్కు విషయంలో బాగా వివాదముంది. ఎంపీ గతంలోనే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో తన ఓటు హక్కు నమోదుచేసుకున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. సరే ఈ విషయమై ప్రస్తుతం న్యాయవివాదంలో ఉంది. ఈ ఓటును తీసేసినా ఇండిపెండెంట్ మద్దతు, రాజ్యసభ ఎంపీ కనకమేడల ఓటుతో మున్సిపల్ ఛైర్మన్ పదవి టీడీపీకే దక్కుతుందనటంలో సందేహం లేదు.

క్షేత్రస్ధాయిలోని ఓట్లను దృష్టిలో పెట్టుకుంటే ఇంతస్పష్టంగా విషయం అర్ధమవుతున్నా ఇంకా ఎందుకని వైసీపీ ఎందుకని రాద్దాంతం చేస్తోందో అర్ధం కావటంలేదు. కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం జరగకుండా, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక జరగనీయకుండా ఎంతకాలమని అధికారపార్టీ అడ్డుపడుతుంది. అధికారులను మ్యానేజ్ చేసి ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ప్రక్రియను అడ్డుకోవటం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు తప్ప ఇంకే ఉపయోగం ఉండదు.

కొండపల్లి మున్సిపాలిటీని టీడీపీ గెలుచుకుంటే వైసీపీకి వచ్చే నష్టం ఏమిటో కూడా అర్ధం కావటంలేదు. మున్సిపాలిటిలో గెలవటాన్ని అంత ప్రతిష్టగా తీసుకునుంటే ముందునుండే వ్యూహాలను అనుసరించుండాల్సింది. ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి మెజారిటి వచ్చిందని తేలిన తర్వాత ఇపుడు గొడవలు పడటం వల్ల జనాల్లో చెడ్డపేరు తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి ఇప్పటికైనా వాస్తవాన్ని గ్రహించి కాస్త వైసీపీ నేతలు తెలివిగా వ్యవహరించాలి.

కొండపల్లి మున్సిపాలిటిలో టీడీపీ గెలిచినంత మాత్రాన అధికారపార్టీకో లేకపోతే ప్రభుత్వానికో జరిగే నష్టమేమీలేదు. ఎన్నికను సజావుగా సాగనిచ్చి టీడీపీ ఛైర్మన్ ప్రమాణస్వీకారానికి సహకరించటం పార్టీకి, ప్రభుత్వానికే మంచిది. లేకపోతే ఒక చిన్న మున్సిపాలిటి విషయంలో ఇంత రాద్దాంతం అవసరమే లేదు. గతంలో టీడీపీ కూడా ఇలాగే చేసింది కాబట్టి ఇపుడు తాము కూడా అలాగే చేస్తామంటే అప్పుడు టీడీపీకి వైసీపీకి తేడా ఏముంటుంది ?