కవర్ చేయబోయి దొరికిపోయిన జగన్

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి కొన్ని నెలలుగా వస్తున్న వార్తలు అందరినీ ఆందోళనలోకి నెడుతున్నాయి. నెలా నెలా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వడానికి కూడా జగన్ సర్కారు కిందా మీదా పడిపోతుండటం.. ఇతరత్రా చెల్లింపులు, బిల్లుల విషయంలో చేతులెత్తేస్తుండటం.. ఏ చిన్న అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేకపోతుండటం గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది.

ఏపీలో చాలా చోట్ల రోడ్లు దారుణంగా దెబ్బ తిన్నా వాటికి మరమ్మతులు చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి వేల కోట్ల రూపాయల మేర కాంట్రాక్టర్లకు బిల్లులు ఆగిపోయాయి. ఉన్న అప్పులకు వడ్డీలే కట్టలేని పరిస్థితుల్లో.. కొత్తగా అప్పుల కోసం నానా విధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం కొత్త కొత్త కార్పొరేషన్లు పెట్టడం.. ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టడం.. ఇలా ఎన్నో మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మీడియాలో వార్తలొస్తున్నాయి.

అభివృద్ధి, ఆదాయం మాట మరిచి కేవలం సంక్షేమం గురించే ఆలోచిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందంటూ జగన్ సర్కారును అందరూ దుయ్యబడుతున్నారు. ఐతే వైసీపీ నేతలు మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని నడిపే పెద్దలు పైకి గాంభీర్యాన్నే ప్రదర్శించాలి. కానీ ఎంత దాచినా దాగని దయనీయ స్థితి నెలకొనడంతో ప్రభుత్వ పెద్దలు నెమ్మదిగా ఓపెన్ అయిపోతున్నారు.

ఇప్పటికే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయంలో వాస్తవాలు మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డే ఆర్థికంగా రాష్ట్రం ఎంత నిస్సహాయ స్థితిలో ఉందో చెప్పకనే చెప్పేశారు.

మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకోవడంపై వివరణ ఇస్తూ ఎప్పట్లాగే అమరావతి మీద తన వ్యతిరేకతను ప్రదర్శించబోయిన జగన్.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వాస్తవాలు చెప్పేశారు. “రోడ్లు వేసుకోవడానికి.. డ్రైనేజీలు వేసుకోవడానికి.. కరెంట్ ఇచ్చేదానికి కూడా మన దగ్గర డబ్బులు లేని పరిస్థితి మనముంటే.. రాజధాని అనే ఊహాచిత్రం సాధ్యమవుతుందా?” అని జగన్ అన్నారు. ఐతే అమరావతి విషయంలో కవర్ చేయబోయి జగన్ వాస్తవాలు మాట్లాడేశారని.. ఒక రకంగా తాను చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల దెబ్బకు ఆర్థికంగా రాష్ట్రం దివాళా తీసిందని.. తాను ఏ అభివృద్ధి కార్యక్రమాలూ చేయలేనని సీఎం చెప్పకనే చెప్పేశారని కౌంటర్లు పడుతున్నాయి.