ఎన్టీఆర్ వెర్సస్ విహారి.. చివరికి ఎవరు గెలిచారు?

మంచి పనులు చేస్తూ వాటి గురించి ప్రచారం చేసుకోకుండా ఉండేవాళ్లు చాలా తక్కువ. ఏ పని చేసినా దానికి తగ్గ ప్రచారం చేసుకోవడానికి పక్కా ప్రణాళికలతోనే రంగంలోకి దిగుతుంటారు. దీన్ని తప్పు అని కూడా చెప్పలేం. మంచి చేస్తున్నపుడు క్రెడిట్ తీసుకోవడంలో, ప్రచారం చేసుకోవడంలో తప్పేముందనే అంటారు. ఐతే ఒకరు చేసిన పనికి ఇంకొకరు క్రెడిట్ తీసుకుంటుంటే మాత్రం అది వివాదం కాక మానదు. ఇప్పుడు ఇలాంటి వివాదమే ఒకటి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

భారత టెస్టు జట్టు సభ్యుడిగా కొన్ని మంచి ఇన్నింగ్స్‌లతో సత్తా చాటిన హనుమ విహారి కరోనా సమయంలో సేవా కార్యక్రమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా తన స్థాయిలో ఛారిటీ కొనసాగిస్తున్నాడతను. నేరుగా సాయం అందించడంతో పాటు ఏదైనా తోడ్పాటు అవసరమైన వాళ్ల గురించి సోషల్ మీడియాలో షేర్ చేసి దాతల దృష్టికి తీసుకొస్తున్నాడు.

‘విహారి ఫౌండేషన్’ పేరుతో ఈ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ పేరుతో ట్విట్టర్ హ్యాండిల్ కూడా ఉంది. ఇదిలా ఉంటే తిరుపతి సిటీ వరదలతో అల్లాడిపోతున్న నేపథ్యంలో అక్కడ విహారి ఫౌండేషన్ ద్వారా చిన్న చిన్న సహాయ కార్యక్రమాలు చేపట్టారు. అక్కడ ఎన్టీఆర్ ట్రస్టు దాని స్థాయిలో పెద్ద ఎత్తునే సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఐతే దీని గురించి ఒక టీడీపీ హ్యాండిల్ ద్వారా ట్వీట్ వేశారు. ఈ ట్వీట్‌పై విహారి ఫౌండేషన్ హ్యాండిల్ నుంచి స్పందిస్తూ.. ఫొటోల్లో కనిపిస్తున్న సేవా కార్యక్రమాలు చేస్తున్నది విహారి ఫౌండేషన్ అని.. తమ టీంలో ఇద్దరు ఎన్టీఆర్ ట్రస్ట్ టీషర్టులు వేసుకుంటే అవి చూపించి ఎన్టీఆర్ ట్రస్ట్ క్రెడిట్ తీసుకోవడమేంటని.. ఈ కార్యక్రమాలకు ఎన్టీఆర్ ట్రస్టుకు సంబంధం లేదని పేర్కొన్నారు. ఇది టీడీపీ వాళ్లకు, ఎన్టీఆర్ ట్రస్టుకు చాలా డ్యామేజింగ్‌‌గా అనిపించింది. ఇంత ధైర్యంగా ట్వీట్ వేశారంటే నిజమే కాబోలని నెటిజన్లు అనుకున్నారు.

ఐతే కాసేపటికే ఆ ఫొటోల్లో సహాయ కార్యక్రమాలు చేపడుతోంది నిజంగా ఎన్టీఆర్ ట్రస్టు వాళ్లేనని ఆధారాలతో సహా టీడీపీ వాళ్లు రుజువు చేశారు. దీంతో విహారి ఫౌండేషన్ వాళ్లు ట్వీట్ డెలీట్ చేసి బేషరతుగా క్షమాపణ చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్టు సేవలను అభినందించారు. మొత్తం వ్యవహారంలో విహారి ఇమేజ్ డ్యామేజ్ అయింది.