కేంద్రం తెలివి – ఏపీ రాజధాని హైదరాబాద్ !

కొందరు అన్నట్లుగా ఏపీకి ఏదో శాపం ఉన్నట్లుంది. మద్రాసు నుంచి సొంతంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న నాటి నుంచి.. రాజధాని ఏర్పాటు విషయంలో మాత్రం ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తమకు మించిన తోపులు మరెవరూ ఉండరన్నట్లుగా.. అన్నింట్లోనూ తామే మొనగాళ్లమన్న భావన ఆంధ్రోళ్లలో ఎక్కువంటారు. అలాంటి అతిశయమే వారికి ఒక రాజధాని అంటూ లేకుండాపోయిందన్న ఆగ్రహం కొందరి నోటి నుంచి వినిపిస్తూ ఉంటుంది.

అయితే.. ఇదే వాదనను మరికొందరు మరోలా చెబుతుంటారు. ఆంధ్రోళ్లకు ఇవ్వటమే కానీ తీసుకోవటం తెలీదని.. కానీ ఆ విషయాన్ని అర్థమయ్యేలా చెప్పటంలో ఆ ప్రాంతానికి చెందిన మేధావులు.. నేతలు ఎప్పుడూ చెప్పింది లేదన్న మాట వినిపిస్తూ ఉంటుంది.

ఇంతకూ ఇదంతా ఎందుకంటే.. ఏపీ రాజధానికి సంబంధించి కేంద్రం తీరుకు సంబంధించిన సమాచారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. ఏపీ రాజధానికి సంబంధించి కేంద్రం ఏమనుకుంటుంది? అన్న సూటి ప్రశ్నకు వచ్చే సమాధానం తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఎందుకంటే.. కేంద్రం ఇప్పుడు ఏపీ రాజధానిగా హైదరాబాద్ గానే ప్రస్తావిస్తోంది. విభజన తర్వాత కూడా పదేళ్ల పాటు ఏపీ రాజధాని నగరంగా హైదరాబాద్ ఉంటుంది.

పేరుకు పదేళ్ల పాటు హైదరాబాద్ రాజధాని అని చెప్పినా.. సాంకేతికతలోకి వెళితే.. హైదరాబాద్ లోని ఒక నియోజకవర్గంలోని కొంత భాగాన్ని మాత్రమే ఏపీ రాజధానిగా పేర్కొనటం కనిపిస్తుంది. అయినా.. 2014లో అధికారంలోకి చంద్రబాబు ప్రభుత్వం ఏపీ రాజధానిగా అమరావతిగా ప్రకటించటం.. కేంద్రం కూడా గుర్తించింది కదా? అన్న సందేహం కలగొచ్చు. అయితే.. బాబు తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు అమరావతికి బదులుగా మూడు రాజధానులుగా పేర్కొనటం.. దానికి సంబంధించిన అంశాలు కోర్టులో నలుగుతున్న వైనం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఏపీ రాజధానిగా టెక్నికల్ గా తప్పు లేని హైదరాబాద్ పేరుతో ఉత్తర ప్రత్యుత్తరాల్ని కేంద్రం జరుపుతుందని చెబుతున్నారు. సాంకేతికంగా వంక పెట్టటానికి వీల్లేని మార్గాన్ని కేంద్రం ఎంపిక చేసుకుందన్న మాట వినిపిస్తోంది. కోర్టు కేసుల నేపథ్యంలో అమరావతిని రాజధానిగా అంటే ఒక తలనొప్పి.. అలా అని.. మూడు రాజధానుల పేర్లలో పాలనా రాజధానిగా చెప్పిన విశాఖపట్నాన్నిప్రస్తావిస్తే మరో తిప్పలు. అందుకే.. ఎవరికి ఎలాంటి అవకాశాన్ని ఇవ్వకుండా.. అనవసరమైన వివాదాల జోలికి వెళ్లకుండా హైదరాబాద్ ను ప్రస్తావించటం ద్వారా కేంద్రం తన పని తాను చేసుకుంటూ పోతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.