వైసీపీ గెలిస్తే టీడీపీ ఆఫీసుకు తాళాలు-అచ్చెన్న

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోందని.. రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయి అప్పుల భారం అసాధారణం పెరిగిపోవడం.. గత ఏడాది వ్యవధిలో విపరీతంగా జనాలపై ధరల భారం మోపడం.. రోడ్లు సహా మౌళిక వసతులు దారుణంగా మారడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. సోషల్ మీడియాలో ఎన్నెన్నో అనుకుంటున్నారు కానీ.. ఏవైనా ఎన్నికలు జరిగితే మాత్రం ప్రభుత్వంపై జనాగ్రహం ఎంతమాత్రం కనిపించడం లేదు.

ఉచిత పథకాలు జనాల మీదా బాగానే ప్రభావం చూపుతున్నాయా.. లేక ప్రభుత్వం డబ్బు, అధికార బలం చూపిస్తోందా.. ప్రతిపక్షం మీద జనాలకు నమ్మకం కలగట్లేదా.. ఇలా కారణాలు ఏవైనా సరే.. ప్రతి ఎన్నికలోనూ వైసీపీ హవా కనిపిస్తోంది. తాజాగా మున్సిపల్, పంచాయితీ ఎన్నికల రెండో దశలోనూ వైసీపీ ప్రభంజనమే కనిపించింది.

తమకు కంచు కోట అయిన కుప్పం సహా చాలా చోట్ల ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి చుక్కెదురైంది. దీంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అయినా టీడీపీ ఏమాత్రం ప్రభావం చూపుతుందో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఐతే ఈ విషయంలో తమకు ఎలాంటి సందేహాలు లేవని.. రాష్ట్రంలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పెట్టినా తమదే విజయం అని అంటున్నారు టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు. స్థానిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆయన మీడియాకు వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయనో ఆసక్తికర సవాలు విసిరారు.

వైసీపీ ప్రభుత్వం మీద జనాల్లో తీవ్ర ఆగ్రహం ఉందని.. డబ్బు ఖర్చు పెట్టి, అధికార దుర్వినియోగం చేసి వైసీపీ స్థానిక ఎన్నికల్లో గెలిచిందని.. వైసీపీకి దమ్ముంటే వెంటనే అసెంబ్లీని రద్దు చేసి వెంటనే ఎన్నికలకు వెళ్లాలని.. ఒకవేళ ఆ ఎన్నికల్లో గెలిస్తే టీడీపీ ఆఫీసుకి తాళాలు వేస్తామని ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా తాను ప్రకటిస్తున్నానని ఆయనన్నారు.

టీడీపీ కార్యకర్తలు ఇంతకుముందు వైసీపీకి చాలా భయపడేవారని.. బయటికి రాలేకపోయారని.. తమ మద్దతుదారులను పోలింగ్ బూత్‌లకు తీసుకొచ్చి ఓట్లు కూడా వేయించలేకపోయిన మాట వాస్తవమని.. కానీ తాజా ఎన్నికల్లో దేనికీ భయపడకుండా ముందుకొచ్చి గొప్పగా పోరాడారని.. కేసులు పెడితే పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి అంటూ ప్రాణాలకు తెగించి పోరాడారని.. వాళ్లకు తాను పాదాభివందనం చేస్తానని అచ్చెన్నాయుడు అన్నారు.