ప్రపంచంలోనే సంపన్నదేశంగా డ్రాగన్

ప్రపంచదేశాల్లోనే రోగ్ నేషన్ గా ప్రచారంలో ఉన్న చైనా అత్యంత సంపన్నదేశంగా నిలిచింది. ఇన్ని దశాబ్దాలుగా ఈ హోదాను అనుభవిస్తున్న అగ్రరాజ్యం అమెరికాను కాదని తాజా పరిణామాల్లో డ్రాగన్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం హోదాను అందుకున్నది. సంపన్న దేశాల వ్యవహారాలను మదింపు చేసే అంతర్జాతీయ సేవల సంస్ధ మెకిన్సే తాజా లెక్కల ప్రకారం చైనా సంపద 2020 ప్రకారం 120 లక్షల కోట్ల డాలర్లకు ఎదిగినట్లు సమాచారం.

2000 సంవత్సరంలో 7 లక్షల కోట్లుగా ఉన్న చైనా సంపద కేవలం 13 ఏళ్ళలో 113 లక్షల కోట్లకు చేరుకోవటం ఆశ్చర్యంగా ఉంది. అమెరికాతో పోల్చితే చైనాలోని రియల్ ఎస్టేట్, పవర్, పారిశ్రామిక రంగాల్లో విపరీతమైన డెవలప్మెంట్ నమోదు చేసుకోవటమే ఒక్కసారిగా ఇన్ని లక్షల కోట్ల డాలర్ల సంపద పెరగటానికి ప్రధాన కారణంగా మెకిన్సే విశ్లేషించింది. అమెరికా మొత్తం సంపద 20 ఏళ్ళల్లో రెండురెట్లు అంటే 90 లక్షల కోట్ల డాలర్లుగా నమోదైంది.

ఇక 2000లో ప్రపంచదేశాల సంపద 156 లక్షల కోట్లు డాలర్లుండగా 2020 నాటికి 514 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. పెరిగిన ప్రపంచదేశాల సంపదలో మూడోవంతు డ్రాగన్ దే కావటం ఆశ్చర్యంగా ఉంది. మొత్తం ప్రపంచదేశాల జీడీపీలో టాప్ 10 దేశాల సంపదే 60 శాతంగా నమోదైంది. తాజా లెక్కల ప్రకారం చైనా, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్, మెక్సికో, స్వీడన్ దేశాలు ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశాలుగా నిలిచాయి.

సరే మెకిన్సే రిపోర్టును పక్కనపెట్టేస్తే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మెక్సికో దేశం అత్యంత ధనిక దేశాల్లో ఒకటిగా ఎలా చేరుకుంది అనేది చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. సంపద పెరగటానికి మెక్సికోలో అందరికీ కనిపించే మార్గాలు పర్యాటకం+భూగర్భగనులు మాత్రమే కానీ తెరవెనుక మాత్రం డ్రగ్స్ వ్యాపారం కూడా ఉన్నట్లు అనుమానంగా ఉంది. మాదకద్రవ్యాల వ్యాపారంలో పీకల్లోతు కూరుకుపోయిన దేశాల్లో మెక్సికో కూడా ఉందనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఏదేమైనా అగ్రరాజ్యాన్ని వెనక్కునెట్టి అత్యంత సంపన్నదేశంగా చైనా అవతరించటం ప్రపంచదేశాలకు ఇబ్బందనే చెప్పాలి.