రాజధాని అమరావతి కేసుల్లో కీలక పరిణామం !

జగన్మోహన్ రెడ్డి నిర్ణయించిన మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ రద్దుపై ఈనెల 15వ తేదీ నుంచి విచారణ ప్రారంభమవుతోంది. ఇప్పటికే చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ విచారణను 15వ తేదీ నుంచి హైబ్రిడ్ పద్దతిలో హైకోర్టు ధర్మాసనం విచారణ మొదలుపెట్టబోతోంది. నిజానికి ఈ విచారణ ఎప్పుడో మొదలై ముగిసిపోవాల్సింది. అయితే హైకోర్టు చీఫ్ జస్టిస్ మారిపోవటంతో విచారణ మొదలేకాలేదు. చీఫ్ జస్టిస్ గా జేకే మహేశ్వరి ఉన్నపుడు విచారణ మొదలైందంతే.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో కేసులు దాఖల్వటం, విచారణ సందర్భంగా అప్పటి చీఫ్ జస్టిస్ తో పాటు కొందరు జడ్జీలు చేసిన వ్యాఖ్యలు, వాటికి అనుగుణంగా ఇచ్చిన తీర్పులపై జగన్ అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డేకి ఫిర్యాదు చేయటంతో దేశంలో సంచలనమైంది. తర్వాత జేకే మహేశ్వరి వెంటనే బదిలీ అయిపోయారు. మహేశ్వరితో పాటు కొందరు జడ్జీలను కూడా సుప్రీంకోర్టు బదిలీ చేసింది. ఆ తర్వాత బాధ్యతలు తీసుకున్న అరూప్ గోస్వామి ముందుకు రాజధాని కేసుల విచారణ వచ్చింది.

అరూప్ విచారణ మొదలుపెట్టకుండానే బాధ్యతలు తీసుకున్న 8 మాసాలకే బదిలీ అయిపోయారు. దాంతో బాధ్యతలు తీసుకున్న చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ ముందుకు విచారణ వచ్చింది. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనంలో జడ్జీలు ఎం సత్యనారాయణమూర్తి, డీవీఎస్ఎస్ సోమయాజులు సభ్యులుగా ఉన్నారు. అయితే అప్పటి చీఫ్ జస్టిస్ మహేశ్వరితో పాటు జగన్ మరికొందరు జడ్జీలపైన కూడా ఫిర్యాదులు చేశారు. అలా జగన్ ఫిర్యాదులు చేసిన వారిలో సత్యనారాయణమూర్తి, సోమయాజులు కూడా ఉన్నారు.

వాళ్ళిద్దరు కూడా రాజధాని విచారణ ధర్మాసనంలో సభ్యులుగా ఉండటంతో అధికారపార్టీ నేతలు సఫొకేషన్ గా ఫీలవుతున్నారు. నిజానికి రాజధాని ఎక్కడుండాలనే నిర్ణయం పూర్తిగా రాష్ట్రప్రభుత్వ ఇష్టమే అని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో తేల్చేసింది. కాబట్టి రాజధానిగా అమరావతే ఉండాలని కానీ లేదా మరో ప్లేసులోనే ఉండాలని చెప్పే హక్కు హైకోర్టుకు లేదు. కాకపోతే అమరావతి నిర్మాణానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం తీసుకున్న భూముల వివాదాన్ని జగన్ ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందనేది ఆసక్తిగా మారింది. రైతులకు న్యాయం చేయకుండా ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం లేదు.

హైకోర్టు కూడా బహుశా ఇదే విషయాన్ని స్ట్రెస్ చేసే అవకాశాలున్నాయి. అయితే భూములు తీసుకునే సమయంలో రైతుల నుండి ప్రభుత్వం ఎలాంటి ఒప్పందం చేసుకున్నది అందులో ఏమన్నా లొసుగులున్నాయా అనే విషయం బయటకు వచ్చే అవకాశాలున్నాయి. ఏదేమైనా భూముల పంచాయితీకి ప్రభుత్వ పరిష్కారం చూపగలిగితే రాజధానికి వ్యతిరేకంగా వేసిన కేసులన్నీ వీగిపోతాయి. లేదంటే 3 రాజధానుల విషయం కలే. మరి 15వ తేదీన మొదలయ్యే విచారణలో ఏమి జరుగుతుందో చూడాల్సిందే.