సోముకు కంట్లో న‌లుసుగా మారిన సొంత పార్టీ నేత‌…!


బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు పార్టీ చీఫ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టి ఏడాదిన్న‌ర దాటుతోంది. ఆయ‌న హ‌యాంలో కీల‌క‌మైన రెండు ఉప ఎన్నిక‌లు వ‌చ్చాయి. ఒక‌టి తిరుప‌తి పార్ల‌మెంటు, రెండు బ‌ద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నిక వ‌చ్చింది. అయితే..ఆ రెండు చోట్లా పార్టీ ఘోరంగా ఓడిపోయింది. దీనికి తోడు నాయ‌కుల మ‌ధ్య కూడా క‌లివిడి లేదు. దీనికి సంబంధించి సోము చేస్తున్న ప్ర‌య‌త్నాలు కూడా క‌నిపించ‌డం లేదు. దీంతో కేంద్రంలోని అధిష్టానానికి ఈ ప‌రిణామం.. ఇబ్బందిగా మారింది. పైకి మాత్రం తాము వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేస్తాం.. అని చెబుతున్నా.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం ఆ త‌ర‌హా వ్యూహాలు మాత్రం క‌నిపించ‌డం లేదు. దీంతో సోము వైఖ‌రిపై కేంద్రంలోని పెద్ద‌లే.. ఒకింత గుస్సాగా ఉన్నారు.

దీంతో గ‌తంలో లేని విధంగా సోము ఇప్పుడు దూకుడు పెంచారు. గ‌డిచిన వారం రోజులుగా ఆయ‌న అధికార పార్టీ నేత‌ల‌పై తీవ్ర స్థాయిలో రెచ్చిపోతున్నారు. తాజాగా రాష్ట్ర ప్ర‌జ‌లు త‌మ‌కు ఓటేస్తే..కేంద్రం ద‌గ్గ‌ర కొట్లాడైనా.. స‌రే.. ప్ర‌త్యేక హోదా తీసుకువ‌స్తామ‌ని చెప్పారు. ఇది నిజానికి సోము నుంచి ఊహించే మాట కాదు. కానీ, ఆయ‌న హామీ ఇచ్చారు. త‌మ‌కు ఓట్టేసిన త‌ర్వాత‌.. ప్ర‌జ‌లు హోదా గురించి త‌మ‌కు అడ‌గాల‌న్నారు. ఇక‌, మ‌రో వైపు.. బూతులు మాట్లాడుతున్న మంత్రుల‌కు “ఎర్రి పుష్పాలు” అనే అవార్డులు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు కూడా సోము వెల్ల‌డించారు. అంటే.. ఒక‌ర‌కంగా.. ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో ఆయ‌న వైసీపీతో త‌ల‌ప‌డుతున్నారు.

నిజానికి ఇన్నాళ్ల‌లో లేనిది.. ఇప్పుడు ఒక్క‌సారిగా సోములో ఇంత మార్పు రావ‌డానికి కార‌ణం ఏంటి? వైసీపీ నేత‌ల‌పై ఈ త‌ర‌హాలో ఎందుకు కామెంట్లు చేస్తున్నారు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఒక నాయ‌కుడని బీజేపీలోనే గుస‌గుస వినిపిస్తోంది. ప్ర‌స్తుత ప‌రిస్థితిలో సోముకు సాటిరాగ‌ల నాయ‌కుడు.. ఆయ‌న‌ను మారిస్తే.. ప‌గ్గాలు చేప‌ట్టే నేత‌.. లేర‌ని.. సోము వర్గం కొన్నాళ్లుగా భావిస్తోంది. అందుకే.. ప‌రిస్థితి ఎలా ఉన్నా.. మార్పు ఉండ‌బోద‌ని కూడా సోము వ‌ర్గం నాయ‌కులు చెబుతున్నారు. అయితే.. తాజాగా జాతీయ‌స్థాయి నాయ‌కుడిగా పేరున్న స‌త్య కుమార్‌.. ఇటీవ‌ల కాలంలో వైసీపీ స‌ర్కారుపై ప‌దునైన విమ‌ర్శ‌లు చేశారు.

బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశంలో మాట్లాడిన స‌త్య‌కుమార్‌.. “మీకు పాల‌న చేత‌కావ‌డంలేదు. అందుకే కేంద్రంపై ప‌డి ఏడుస్తున్నారు” అంటూ.. వైసీపీ ప్ర‌బుత్వంపై నిప్పులు చెరిగారు. అంతేకాదు.. వ్యాట్ పెంచింది మీరే.. మీరు పెట్రోల్ ధ‌ర‌లు ఎందుకు త‌గ్గించ‌రో చెప్పాలంటూ.. నిల‌దీశారు. ఈ కామెంట్లు జాతీయ స్థాయిలో వ‌ర్క‌వుట్ అయ్యాయి. నిజానికి బీజేపీ ఏం మాట్లాడినా స్పందించ‌ని వైసీపీ ప్ర‌భుత్వం స‌త్య‌కుమార్ వ్యాఖ్య‌ల‌పై హుటాహుటిన స్పందించి.. వివ‌ర‌ణ ఇచ్చింది.

ఈ ప‌రిణామం.. సోముకు కంట్లో న‌లుసుగా మారింది. త‌న‌కు పోటీగా స‌త్య కుమార్ రెడీ అవుతున్నార‌ని.. ఆయ‌న భావిస్తున్న‌ట్టు బీజేపీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. దీంతో ఇప్పుడు సోము స్పీడ్ పెంచార‌ని అంటున్నారు. అయితే.. ఈ స్పీడ్ ఎంత వ‌ర‌కు కొన‌సాగుతుంద‌నేది డౌటేన‌ని వారు అంటుండ‌డం గ‌మ‌నార్హం.