ఆయ‌న‌తో 30 ఏళ్ల వైరం.. బాబు గెలిచి నిలుస్తారా ?

మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబును చివ‌ర‌కు ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో కూడా గ‌ట్టిగా టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నేత‌లు. గ‌త ఎన్నిక‌ల్లోనే బాబు కుప్పంలో చావు త‌ప్పి క‌న్నులొట్ట‌బోయిన చందంగా కేవ‌లం 30 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక ఇటీవ‌ల జ‌రిగిన స‌ర్పంచ్ ఎన్నిక‌లు, జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల్లోనూ టీడీపీ చిత్తు చిత్తు అయ్యింది. ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డితో పాటు చిత్తూరు ఎంపీ రెడ్డ‌ప్ప ఇద్ద‌రూ కూడా కుప్పంపై బాగా ఫోక‌స్ చేసి టీడీపీకి సీన్ లేకుండా చేశారు.

ఇక ఇప్పుడు కుప్పం మున్సిప‌ల్ ఎన్నిక‌లపై కూడా పెద్దిరెడ్డి బాగా ఫోక‌స్ చేశారు. ఆయ‌న అక్క‌డే మ‌కాం వేసి కుప్పం మున్సిపాల్టీపై తొలిసారే వైసీపీ జెండా ఎగ‌ర‌వేసేలా చేయాల‌ని ఎన్నో ఎత్తులు వేస్తున్నారు. పెద్దిరెడ్డి కాక చంద్ర‌బాబుకు చేరింది. అందుకే ఆయ‌న కుప్పం కోట కూలిపోతోంద‌ని భావించే మునిసిప‌ల్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రాకుండానే కుప్పంలో వాలిపోయి ప్ర‌చారం చేస్తున్నారు. పెద్దిరెడ్డి కుప్పానే టార్గెట్ చేయ‌డంతో బాబు ఇప్పుడు పెద్దిరెడ్డి ఇలాకా అయిన పుంగ‌నూరును టార్గెట్ చేసే ప‌ని స్టార్ట్ చేశారు.

పెద్దిరెడ్డిని పుంగ‌నూరులో కంట్రోల్ చేయ‌క‌పోతే ఆయ‌న త‌న కుప్పం సీటుకు ఎర్త్ పెట్టేశాలా ఉన్నాడ‌న్న విష‌యం బాబుకు కాస్త లేట్‌గా అర్థ‌మైంది. పెద్దిరెడ్డి కుప్పంలో బాబు గెలిస్తే తాను రిటైర్మెంట్ తీసుకుంటాన‌ని మ‌రీ స‌వాల్ కూడా చేశారు. దీంతో కుప్పం ప‌ర్య‌ట‌న‌లో బాబు పెద్దిరెడ్డిని టార్గెట్ చేశారు. ఈ సారి పెద్దిరెడ్డి పుంగ‌నూరులో ఎలా గెలుస్తారో ? చూస్తాన‌ని ప్ర‌తి స‌వాల్ విసిరారు. ఇందుకు స్పెష‌ల్ ఆప‌రేష‌న్ కూడా స్టార్ట్ చేశారు.

పుంగనూరులో పార్టీ బాధ్య‌త‌ల‌ను బాబు ఏకంగా ముగ్గురు నేత‌ల‌కు అప్ప‌గించారు. నియోజ‌క‌వ‌ర్గానికి చ‌ల్లా రామ‌చంద్రారెడ్డిని ఇన్‌చార్జ్‌గా నియ‌మించారు. బాబుతో పాటు అక్క‌డ కేడ‌ర్‌ను స‌మ‌న్వ‌యం చేసే బాధ్య‌త‌ల‌ను టీడీపీ సీనియర్‌ నేతలు అమర్నాథ్‌రెడ్డి, నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డికి అప్పగించారు. ఈ ముగ్గురు కలిసి పుంగ‌నూరులో పెద్దిరెడ్డికి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి నిద్ర‌లేకుండా చేయాల‌ని ఆదేశించార‌ట‌. ఏదేమైనా పెద్దిరెడ్డి, చంద్ర‌బాబుది 30 ఏళ్ల వైరం. ఈ వైరం నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు పై చేయి సాధిస్తారో ? చూడాలి.