కారు.. కారు.. హుజూరాబాద్ లో బ్రేకులు ఎందుకు పడ్డాయి?

దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా.. ఒక అంచనా ప్రకారం రూ.500 కోట్లకు మించిన ఎన్నికల ఖర్చుతో జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఒక చరిత్రగా నిలిచిపోనుంది. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చరిత్రకు నాంది ప్రస్తావన జరిగినట్లుగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఈ ఉప ఎన్నిక కోసం దేశంలో ఇంకెక్కడా లేని రీతిలో దళితులకు రూ.10లక్షలు ఇస్తూ దళితబంధు పథకాన్ని షురూ చేయటం తెలిసిందే. కారణం.. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితులు ఎక్కువగా ఉండటమే. వారి మనసుల్ని దోచుకోవటానికి ఇంతకు మించిన తాయిలం లేదన్నట్లుగా ప్లాన్ చేసిన గులాబీ బాస్ కు దిమ్మ తిరిగిపోయి.. మైండ్ బ్లాక్ అయ్యే తీర్పును ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.

నెలల తరబడి సాగిన ఎన్నికల ప్రచారం.. ఎన్నికల నోటిఫికేషన్ రావటానికి ముందే.. నియోజకవర్గంలో ఈటలకు సన్నిహితంగా ఉండే వారితో సహా అందరిని ఆయన నుంచి దూరం చేయటం.. ఒక విధంగా ఏకాకిని చేసిన తీరు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. తొలిసారి ఆయన ఓటమి రుచి చూస్తారా? అన్న సందేహాన్ని వ్యక్తమయ్యేలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

అలాంటి ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో ఎలా గెలిచారు? అది కూడా 24 వేల మెజార్టీతో అంటే మాటలు కాదు. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన ఎన్నికల్లో ఇంత మెజార్టీ అంటే.. ఘన విజయంగా చెప్పుకోవాలి. రికార్డు స్థాయిలో పోలింగ్ జరగటం.. ప్రతి రౌండ్ లోనూ నువ్వా నేనా అన్న రీతిలో సాగిన పోరులో.. కాసిన్ని ఓట్ల మెజార్టీని మూట గట్టుకుంటూ.. చివరకు 24వేల ఓట్ల మెజార్టీని సొంతం చేసుకోవటం మామూలు విషయం కాదని చెప్పాలి.

ఇంతకూ హుజూరాబాద్ లో ఈటల గెలుపు వెనుక ఏం జరిగింది? అదెలా సాధ్యమైంది. పోల్ మేనేజ్ మెంట్ లో తనకు ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ లకు తెర తీసే కేసీఆర్.. తాజా ఉప ఎన్నిక మాత్రం ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చిందనే చెప్పాలి. ఇంతకీ గులాబీ కారుకు ఎందుకు బ్రేకులు పడ్డాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. కేసీఆర్ చెప్పిన అభివృద్ధి మంత్రమే కాదు.. తాయిలాలు సైతం పని చేయలేదు.

టీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం పార్టీకి చెందిన నేతలు భారీగా హుజూరాబాద్ లో దిగారు. పోల్ మేనేజ్ మెంట్ స్క్రిప్టును పక్కాగా ఫాలో అయ్యారు. దీనికి తోడు దళితబంధు లాంటి భారీ ప్రజాకర్షక పథకాన్ని తీసుకొచ్చారు.ఇన్ని తెచ్చినప్పటికీ.. ప్రజల్లో ఈటల మీద ఉన్న సెంటిమెంట్ ను డైవర్ట్ చేయటంలో జరిగిన పొరపాటే తాజా ఓటమికి ప్రధాన కారణంగా చెప్పాలి.

విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేయటం.. తెలంగాణ ఆత్మాభిమానానికి ప్రతీకగా చెప్పే ఈటలను.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదలు.. ప్రతి ఒక్కరు విరుచుకుపడటం హుజూరాబాద్ ఓటర్లకు నచ్చలేదని చెబుతారు. ఎందుకంటే..పార్టీ నుంచి గెంటేసిన తీరు వారిని బాధించటంతో పాటు.. మొన్నటి వరకు పొగిడిన నోళ్లు.. ఇప్పుడు తిట్టటాన్ని వారు జీర్ణించుకోలేదు. దీనికి తోడు.. భూకబ్జా ఆరోపణలు చేస్తూ.. అధికారుల దాడుల పర్వాన్ని వ్యక్తిగత దాడిగా చేశారు. ఇలాంటివన్నీ టీఆర్ఎస్ పార్టీకి ప్రతికూలంగా మారాయి.

అదే గులాబీ కారుకు హుజూరాబాద్ లో బ్రేకులు పడేలా చేశాయని చెబుతున్నారు. తెలంగాణ ప్రజలు ఏమైనా భరిస్తారు కానీ.. తల ఎగరేయటాన్ని అస్సలు ఒప్పుకోరు. అలాంటి భావన కలిగేలా చేసిన టీఆర్ఎస్ నేతలు.. తమకు తెలీకుండా తాము ఓడిపోవటానికి కారణంగా మారారని చెప్పక తప్పదు.