ప‌వ‌న్ దూకుడు.. బీజేపీ ఏం చేస్తుందో?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ విశాఖ ప‌ర్య‌ట‌న‌తో రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు మారిపోతాయా? ఇప్ప‌టివ‌ర‌కూ పొత్తులో కొన‌సాగిన బీజేపీతో ఆ పార్టీ బంధం తెచ్చుకునేందుకు సిద్ధ‌మైందా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. బీజేపీకి జ‌న‌సేన గుడ్‌బై చెప్ప‌నుంద‌ని కొన్ని రోజులుగా సాగుతున్న ప్ర‌చారానికి ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌తో ఓ స్ప‌ష్టత వ‌స్తుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీక‌ర‌ణకు కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు వేగంగా అడుగులు వేస్తోంది. కానీ ఇప్పుడా నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా పోరాడుతున్న స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగుల‌కు సంఘీభావం తెలిపేందుకు ప‌వ‌న్ సిద్ధ‌మ‌య్యారు.

విశాఖ‌లో ప‌వ‌న్ మూడు రోజుల పాటు ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధానంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ఉక్కు ప‌రిర‌క్ష‌ణ పోరాట స‌మితి నిర్వ‌హిస్తున్న భారీ బ‌హిరంగ స‌భ‌లో ప‌వ‌న్ పాల్గొని కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా త‌మ పార్టీ విధానాన్ని వెల్ల‌డించ‌నున్నారు. దీంతో ఒక ప‌క్క బీజేపీతో పొత్తులో ఉంటూనే.. ఇప్పుడు కేంద్రంలోని ఆ పార్టీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా ప‌వ‌న్ ఏం చెప్ప‌బోతున్నార‌నే ఆస‌క్తి రాజ‌కీయ వ‌ర్గాల్లో నెల‌కొంది.

కొంత కాలం నుంచే బీజేపీతో అనుబంధాన్ని తెంచుకునేందుకు ప‌వ‌న్ అవ‌కాశం కోసం చూస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అందుకే బ‌ద్వేలు ఉప ఎన్నిక‌లో బీజేపీ త‌ర‌పున ప్ర‌చారం కూడా చేయ‌లేదు. రాజ‌కీయ విలువ‌లు పాటిస్తూ జ‌న‌సేన ఆ ఎన్నిక నుంచి త‌ప్పుకుంది. కానీ బ‌రిలో దిగిన బీజేపీ జ‌న‌సేనాని నుంచి మ‌ద్ద‌తును ఆశించింది. కానీ ప‌వ‌న్ నుంచి ఎలాంటి స‌పోర్ట్ అంద‌లేదు.

ఇక విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకించ‌డం ద్వారా.. ఇప్పుడు ప‌వ‌న్ నేరుగా అక్క‌డికి వెళ్లి స‌భ‌లో పాల్గొన‌డం ద్వారా.. బీజేపీతో జ‌న‌సేన బంధానికి ఇక ముగింపు ప‌డిన‌ట్లేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రోవైపు రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లోనూ ప‌వ‌న్ స‌భ గురించి చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఈ స‌భ త‌ర్వాత జ‌న‌సేన‌తో పొత్తు కొన‌సాగ‌డం క‌ష్ట‌మేన‌న్న వ్యాఖ్య‌లు బీజేపీ వ‌ర్గాల్లోనే వినిపిస్తున్నాయి.

అయితే పొత్తులు కేవ‌లం ఎన్నిక‌ల వ‌ర‌కే ప‌రిమిత‌మ‌ని పార్టీ విధానాలు, నిర్ణ‌యాలు ఎవ‌రివి వాళ్ల‌వే అని జ‌న‌సేన స్ప‌ష్టం చేస్తోంది. ఈ నేప‌థ్యంలో బీజేపీతో పొత్తు ఉంటుందా? లేదా? అనేదానిపై ప‌వ‌న్ విశాఖ స‌భ త‌ర్వాత ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశముంది. ఈ స‌భ ద్వారా విశాఖ ఉక్కు కోసం ప్ర‌జ‌ల ప‌క్షాల నిల‌బ‌డ్డ పార్టీగా మార్కులు కొట్టేయ‌డంతో పాటు విశాఖ‌లో పార్టీని బ‌లోపేతం చేసేందుకు ప‌వ‌న్ వ్యూహాలు ర‌చించార‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు.

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీకి ఒంట‌రిగా పోటీ చేసేంత సీన్ లేదు. అందుకే జ‌న‌సేన‌తో క‌లిసి ముందుకు సాగాల‌ని అనుకుంటోంది. మ‌రోవైపు జ‌గ‌న్ను అడ్డుకునేందుకు టీడీపీ కూడా బీజేపీతో పొత్తుకు చేయి చాపుతుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు బీజేపీ జ‌న‌సేన విడిపోతే.. ప‌రిస్థితులు ఎలా మార‌తాయో? చూడాలి. వచ్చే ఎన్నిక‌ల్లో మాత్రం టీడీపీ, జ‌న‌సేన పొత్తు ఖాయ‌మ‌నిపిస్తోంది. ఇక ఈ రెండు పార్టీల‌తో క‌లిసి బీజేపీ ఉంటుందా? లేదా? అన్న‌దే ప్ర‌శ్నార్థ‌కం.