బాంబ్ పేల్చిన పీకే… రాహుల్ ఇప్పట్లో ప్రధాని కాలేరు!

సోనియాగాంధీ గారాల పట్టి రాహుల్ గాంధీ ఇప్పట్లో ప్రధాని అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే చాలా దశాబ్దాలపాటు బీజేపీనే దేశాన్ని పరిపాలించబోతోంది. ఒక వేళ అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఉంటే.. అప్పుడు కూడా రాహుల్ గాంధీకి పోటీ లేక పోతే ఆయన జీవిత చరమాంకంలో ప్రధాని అయ్యే ఛాన్స్ ఉంది. ఇలా ఎందుకు చెబుతున్నామంటే.. బీజేపీ రాజకీయ భవిష్యత్తుపై వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు.

భారత రాజకీయాల్లో బీజేపీ కీలకం కానుందని, రాబోయే చాలా దశాబ్దాల పాటు బీజేపీ ఎక్కడికీ పోదని వెల్లడించారు. బీజేపీని ఓడించాలని రాహుల్ కలలు కంటున్నారని అది ఇప్పట్లో సాధ్యం కాదని ఆయన ఆశలపై పీకే నీళ్లు చల్లారు. ప్రతిపక్షాలు అనుకున్నట్లు బీజేపీని ప్రజలు ఇప్పట్లో గద్దె దింపరని చెప్పారు. జాతీయస్థాయిలో ఒక్కసారి ఏ పార్టీ అయినా 30 శాతం ఓట్లు సాధిస్తే వెంటనే కనుమరుగవడం కష్టమన్నారు.

బీజేపీ ప్రభావం దేశంలో 30, 40 ఏళ్లు ఉంటుందని పీకే స్పష్టం చేశారు. ఒకవేళ ప్రజలు మోదీని గద్దె దింపవచ్చు… కానీ బీజేపీ ఎక్కడి పోదని జోస్యం చెప్పారు. ఇందుకు పీకే ఓ ఉదాహరణ కూడా చెప్పారు. స్వాంతత్ర్యం అనంతరం 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభావం ఉండిందని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా బీజేపీ దశాబ్దాల పాటు అదే స్థానంలో ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గ్రహించడం లేదని తప్పుబట్టారు. మోదీని ప్రజలు విసిరి కొడతారని రాహుల్ భ్రమల్లో ఉన్నారని, అలాంటిదేమీ జరగదన్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మోదీకి ఎదురు వెళ్లలేరని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు.

ఇటీవల ప్రశాంత్‌కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని అందరూ అనుకున్నారు. కాంగ్రెస్‌లో చేరి సోనియా గాంధీకి రాజకీయ సలహాదారుగా వ్యవహరిస్తారని ప్రచారం జరిగింది. ఆయన చేరికను కాంగ్రెస్ సీనియర్లు వ్యతిరేకించారనే వార్తలు వచ్చాయి. కాంగ్రెస్‌తో ప్రశాంత్‌ కిషోర్‌ చర్చలు బెడిసికొట్టిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలపై బీజేపీ నేత అజయ్ సెహ్రావత్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. బీజేపీ ప్రభావాన్ని పీకే కూడా అంగీకరించారని తెలిపారు. ఇదే విషయాన్ని కేంద్రమంత్రి అమిత్ షా గతంలోనే చెప్పారని గుర్తుచేశారు. పీకే వ్యాఖ్యలపై కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.