మంగళవారం మరదలు.. షర్మిలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి వ్యక్తిగత దూషణలు, విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది. కొందరు నేతలు పొరపాటున నోరుజారితే…మరికొందరేమో అధికారం ఉంది కదా అన్న ధీమాతో వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ నేత, మంత్రి నిరంజన్ రెడ్డి….వైఎస్సార్ టీపీ అధినేత వైఎస్ షర్మిలపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఈ కోవలోకే వస్తాయి. మంగళవారం మరదలు అంటూ షర్మిలనుద్దేశించి నిరంజన్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇపుడు తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి.

తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యంగా పార్టీ పెట్టానని చెప్పిన షర్మిల….పాదయాత్ర చేస్తోన్న సంగతి తెలిసిందే. పార్టీ పెట్టినప్పటి నుంచి నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతున్న షర్మిల…ప్రతి మంగళవారం నాడు నిరుద్యోగ దీక్ష చేస్తున్నారు. పాదయాత్ర చేస్తున్నప్పటికీ…మంగళవారం నాడు దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే షర్మిలపై నాగర్‌కర్నూల్‌ జిల్లాలో జరిగిన టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశంలో నిరంజన్ రెడ్డి షాకింగ్ కామెంట్లు చేశారు.

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయాలని ”మంగళవారం మరదలు ఒకామె బయలు దేరింది’’ అంటూ నిరంజన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. అంతేకాదు, షర్మిల డిమాండ్‌ వెనుక ఆంధ్రోళ్ల కుట్ర దాగి ఉందని, 20 శాతం నాన్ లోకల్ కోటాలో తెలంగాణ ఉద్యోగాలను పొందేందుకు ఆంధ్రవాళ్ల కోసం షర్మిల మాట్లాడుతున్నారని నిరంజన్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నాయి.

రాజకీయాల్లో నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు సహజమని, కానీ, ఈ స్థాయిలో దిగజారి మహిళ అని కూడా చూడకుండా షర్మిలపై నీచమైన వ్యాఖ్యలు చేయడం ఏమిటని నిరంజన్ రెడ్డిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ యువతకు ఉద్యోగాలివ్వకుండా టీఆర్ఎస్ మోసం చేసిందని, మరోసారి యువతను మోసం చేసేందుకు లోకల్ సెంటిమెంట్ ను రెచ్చగొట్టేలా నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారని విమర్శలు వస్తున్నాయి.