బీజేపీలో చేరనున్న వీవీఎస్ లక్ష్మణ్ ?

టీమిండియా మాజీ క్రికెటర్‌, తెలుగు తేజం వీవీఎస్‌ లక్ష్మణ్‌ గురించి క్రికెట్ ప్రేమికులకు, క్రీడాకారులకు పరిచయం అక్కర లేదు. భారత జట్టులో చాలాకాలం పాటు కీలక ఆటగాడిగా కొనసాగిన లక్ష్మణ్…ఎన్నో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ లతో జట్టుకు చరిత్రాత్మక విజయాలనందించాడు. ఆసీస్ పై టెస్టులో జట్టు ఫాలో ఆన్ ఆడుతున్న క్లిష్ట సమయంలో ఈ వెరీ వెరీ స్పెషల్ బ్యాట్స్ మన్ తన సొగసరి షాట్లకతో చేసిన డబుల్ సెంచరీ చరిత్ర పుటల్లో ఎంతో ప్రత్యేకమైనదిగా నిలిచి పోయింది.

2012లో అంతర్జాతీయ క్రికెంట్ కు వీడ్కోలు పలికిన ఈ హైదరాబాదీ స్టైలిష్ క్రికెటర్ ఆ తర్వాత…ఐపీఎల్‌ లో హైదరాబాద్ డెక్కన్‌ చార్జర్స్ సారథిగా, ఆటగాడిగా సేవలందించాడు. ప్రస్తుతం సన్‌ రైజర్స్‌ జట్టుకు మెంటర్‌ గా ఉన్న లక్ష్మణ్…త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నారన్న పుకార్లు వినిపిస్తున్నాయి. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయాలని భావిస్తోన్న బీజేపీ పెద్దలు…లక్ష్మణ్ వంటి సెలబ్రిటీలను, క్రీడాకారులను తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు మొదలుబెట్టిందట.

ఈ క్రమంలోనే ఇప్పటికే లక్ష్మణ్ తో బీజేపీ జాతీయ నాయకులు టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో పాటు, జాతీయ నేతలు…లక్ష్మణ్ తో చర్చలు జరిపి పార్టీలోకి ఆహ్వానించారట. దీంతో, లక్ష్మణ్‌ కు కూడా బీజేపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే అమిత్‌ షా సమక్షంలో లక్ష్మణ్‌ కాషాయ కండువా కప్పుకోబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

జీహెచ్‌ ఎంసీ పరిధిలోని ఓ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో లక్ష్మణ్‌ ను బరిలోకి దించాలని బీజేపీ నేతలు పావులు కదుపున్నారని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై బీజేపీ నేతలుగానీ, లక్ష్మణ్ గానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పటికే టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ బీజేపీ ఎంపీగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఇక, కాంగ్రెస్ నేతగా, హెచ్ సీఏ అధ్యక్షుడిగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ రాణిస్తున్నారు. మరి, లక్ష్మణ్ కూడా పొలిటిషియన్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుబెడతారా? లేదా? అన్నది తేలాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.