జగన్, చంద్రబాబుకు జేపీ విజ్ఞప్తి

ఏపీ రాజకీయాలు రచ్చ రంబోలాల తయారయ్యాయి. వ్యక్తిగత దూషణలకు ఏపీ కేరాఫ్ అడ్రస్ నిలించింది. రాజకీయ పార్టీల నేతలు రాజకీయ విమర్శలు పక్కన పెట్టి దూషణ, భూషణలకు దిగుతున్నారు. టీడీపీ నేత పట్టాభి ఒక్క మాటతో రాష్ట్రం మొత్తం రావణకాష్టమైంది. పట్టాభి వ్యాఖ్యలతో అధికార పార్టీ అగ్గిమీదగుగ్గిలమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఏక కాలంలో టీడీపీ కార్యాలయాలపై వైసీపీ నేతలు దాడికి దిగారు. పట్టాభి ఇంటిపై కూడా దాడి చేశారు. అంతటితో ఆగిపోకుండా రెండు పార్టీలు అగ్నికి ఆజ్యం పోశాయి. రెండు రోజులుగా ఏపీ అట్టుడికి పోతోంది. ప్రజా సమస్యలను పక్కకు పెట్టి ఇలా వ్యవహరించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ ఎందుకు ఇలా తయారైందని ఆందోళన చెందుతున్నారు. విభజన హామీపై అధికార, ప్రతిపక్షాలు కలిసి కేంద్రంపై పోరాడాల్సి పోయి.. ఇలా అసభ్య దూషణలు చేసుకోవడం ఏమిటి ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఏపీని సమస్యలు వెంటాడుతున్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కాడెద్దుల్లా కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవాల్సింది పోయి.. ఇలా కీచులాడుకోవడం ఏమిటని మేధావులు, ఆలోచన పరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ పరువును బజారులో పెట్టారని వాపోతున్నారు.

ఏపీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిపై సామాజికవేత్త జయప్రకాష్‌ నారాయణ భావోగ్వేగానికి గురయ్యారు. తాజా పరిస్థితులపై ఆయన ఓ వీడియో సందేశాన్ని ఇచ్చారు. ఇటీవల రాష్ట్రంలో తెలెత్తిన రాజకీయ పరిణాలు ఆలోచించే పౌరులందరిని ఆందోళనకు గురిచేస్తున్నాయని చెప్పారు. పార్టీల మధ్య తీవ్రమైన విద్వేషాలు పెరిగిపోయాయని తెలిపారు. అనాగరిక భాష, పరుషమైన భాష వాడడం.. హింసకు దిగడం ఇవన్నీ రాజకీయాల్లో ఉన్న సమస్యలను బయటపెడుతున్నాయని పేర్కొన్నారు. పార్టీలు పక్షపాతాలకు ఎన్నికల వ్యూహాలకు అతీతంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. భావోద్వేగాలకు, ద్వేషాలకు గురయినప్పుడు మంచి నాయకులు బయపడడం చాలా కష్టమని వ్యాఖ్యానించారు. పార్టీల మధ్య రాజుకున్న కోపానికి సమాన్యులు బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

జగన్, చంద్రబాబుకు విజ్ఞప్తి
అందరూ కలవాలని ఆయన ఆకాంక్షించారు. ఏపీలో రాజకీయ వేడిని చల్లార్చాలని విజ్ఞప్తి చేశారు. అభిప్రాయ విభేదాల్ని సామరస్యంగా శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ సమాజాన్ని అల్లకల్లోలం చేస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్‌కు ప్రతిపక్ష నేత చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. దయచేసి రాష్ట్రంలో సామరస్య వాతావరణాన్ని తీసుకురావాలని కోరారు. కవ్వింపు చర్యలను వదిలేయాలని సూచించారు. జరిగిన ఘటనలను పక్కన పెట్టాలని జగన్‌, చంద్రబాబుకు జయప్రకాష్ నారాయణ వినమ్రంగా విజ్ఞప్తి చేశారు. పెద్ద మనసుతో నాయకులు వ్యవహరిస్తారని ఆశిస్తున్నానని జయప్రకాశ్ నారాయణ చెప్పారు.

రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని తెలిపారు. అధిక ఆదాయాన్నిచ్చే నగరాన్ని కోల్పోయామని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంక్షోభ వాతావరణం ఉందన్నారు. అదే సమయంలో గొప్ప అవకాశాలున్నాయని తెలిపారు. తెలుగు ప్రజలు, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా దూరదృష్టి కలవాళ్లని కొనియాడారు. కష్టపడి పైకి ఎదగాలని కోరుకునే వాళ్లని ప్రశంసించారు. భవిష్యత్తు కోసం ఎన్ని త్యాగాలకైనా వెరవని వాళ్లని, ఆత్మగౌరవం ఉన్నవాళ్లని ఆయన తెలిపారు. రాష్ట్రంలో వనరులు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. మానవ వనరులతో పాటు, వెయ్యి కిలో మీటర్ల తీర ప్రాంతం ఉందన్నారు. రాష్ట్రంలో అపారమైన ఖనిజ సంపద ఉందని జయప్రకాష్ నారాయణ తెలిపారు.