ప‌వ‌న్ విష‌యంలో బీజేపీ.. మౌనం ఎందుకు?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌.. బీజేపీతో పొత్తులో ఉన్నారు. 2020లోనే ఆయ‌న ఎన్నిక‌లు ముగిసిన సంవ‌త్స‌రంలోనే బీజేపీ పెద్ద‌ల‌తో పొత్తు కుదుర్చుకున్నారు. ఏకంగా ఢిల్లీ వెళ్లి మంత్రాంగం న‌డిపివ‌చ్చారు. ఇక‌.. అప్ప‌టి నుంచి బీజేపీతో పొత్తులో ఉన్నాన‌ని.. ప‌వ‌న్ చెబుతున్నారు.

ఢిల్లీ పెద్ద‌లు త‌ర‌చుగా ప‌వ‌న్‌ను వివిధ కార్య‌క్ర‌మాల‌కు కూడా ఆహ్వానిస్తున్నారు. ఇక‌, రాష్ట్రంలోనూ అప్పుడ‌ప్పుడు.. ప‌వ‌న్‌.. బీజేపీ రాష్ట్ర చీఫ్‌.. సోము వీర్రాజు త‌దిత‌రుల‌తో భేటీ అవుతున్నారు. ఉమ్మ‌డి కార్య‌క్ర‌మాల‌కు కూడా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు.. తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లోనూ బీజేపీకి అనుకూలంగా ప‌వ‌న్ చ‌క్రం తిప్పారు. ప్ర‌చారం చేశారు. అయితే.. పార్టీ ఓడిపోయింది. అది వేరే సంగ‌తి కావొచ్చు. కానీ.. ప‌వ‌న్‌-బీజేపీతో పొత్తులోనే ఉన్నార‌నేది వాస్త‌వం.

అయితే.. ఇది నాణేనికి ఒక‌వైపు మాత్ర‌మే. ఏపీలో జ‌గ‌న్‌ను అధికారం నుంచి దింపాలంటే.. బీజేపీతొ పొత్తుతో ఉంటే సాధ్యం కాద ని.. ప‌వ‌న్ ద్రుఢంగా విశ్వ‌సిస్తున్నారు. అంతేకాదు.. మ‌రోవైపు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ కూడా ప‌వ‌న్‌తో జ‌ట్టు క‌డితేనే రాష్ట్రంలో మ‌ళ్లీ 2014 నాటి ప‌రిస్థితి రిపీట్ అవుతుంద‌ని.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌హా.. ఆ పార్టీ నాయ‌కులు భావిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ కూడా టీడీపీతో జ‌ట్టు క‌ట్టేందుకు రెడీ అయ్యారు. దీనికి సంబంధించి అంత‌ర్గ‌త చ‌ర్చ‌లు కూడా ఇప్ప‌టికే పూర్త‌య్యాయ‌ని.. ఇక‌, ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌క‌టించ‌డ‌మే త‌రువాయి అని అంటున్నారు. మ‌రోవైపు.. స్థానిక ఎన్నిక‌ల్లో ప‌లు చోట్ల‌.. టీడీపీ-జ‌న‌సేన అభ్య‌ర్థులు క‌లిసి అదికారం పంచుకున్నారు. సో.. ఇన్ని ప‌రిణామాలు కూడా రాబోయే రోజుల్లో.. టీడీపీ-జ‌న‌సేన పొత్తును ద్రుఢ ప‌రుస్తున్నాయి.

మ‌రి ఇంత జ‌రుగుతున్నా.. బీజేపీ నేత‌ల నుంచి ఎలాంటి రియాక్ష‌న్ వినిపించ‌డం లేదు. క‌నిపించ‌డం లేదు. త‌మ పొత్తు పార్టీ నాయ‌కుడు.. ప‌వ‌న్‌.. టీడీపీలో క‌లిసిపోతున్నార‌ని.. క‌లిసేందుకు రూట్ మ్యాప్ కూడా రెడీ చేసుకున్నార‌ని.. తెలిసినా.. బీజేపీ మౌనంగానే ఉంది. మ‌రి దీనికి రీజనేంటి? పోనీ.. ప‌వ‌న్‌తో పాటు బీజేపీ కూడా టీడీపీతో క‌లిసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తుందా? అంటే.. అలా జ‌ర‌గ‌నే జ‌ర‌గ‌ద‌ని.. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు చెబుతున్నారు. అదే స‌మ‌యంలో రాష్ట్ర బీజేపీ నాయ‌కులు కూడా ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నారు. మ‌రి అలాంటి స‌మ‌యంలో త‌మ మిత్ర‌ప‌క్షంగా పైకి ఉంటూ.. లోపాయికారీగా టీడీపీతో పొత్తుకు ప‌వ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నా.. ఎందుకు సైలెంట్‌గా ఉన్నార‌నేది ప్ర‌శ్న‌.

దీనికి బీజేపీనే కార‌ణ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్పుడు క‌నుక బీజేపీ నోరు తెరిచి.. ప‌వ‌న్‌ను ప్ర‌శ్నిస్తే.. ఆయ‌న ఎదురు సంధించే ప్ర‌శ్న‌ల‌కు బీజేపీ స‌మాధానం చెప్పే ప‌రిస్థితి ఉండ‌ద‌ని అంటున్నారు. ఎందుకంటే.. పొత్తు ఉన్న‌ప్ప‌టికీ.. ప‌వ‌న్‌కు కానీ.. జ‌న‌సేనకు కానీ.. బీజేపీ ఎలాంటివిలువా ఇవ్వ‌లేదు. తిరుప‌తి ఉప ఎన్నిక‌లో త‌మ‌కు టికెట్ ఇవ్వాల‌ని.. ప‌వ‌న్ కేంద్రం పెద్ద‌ల వ‌ద్ద‌కు వెళ్లి పంచాయితీ పెట్టుకున్నా.. రాష్ట్ర బీజేపీ నేత‌లు.. ప‌వ‌న్‌ను ప‌క్క‌న పెట్టి.. టికెట్ తెచ్చుకున్నారు. ఇక‌, స్థానిక ఎన్నిక‌ల్లోనూ ప‌వ‌న్‌తో క‌లిసి పోటీ చేయ‌కుండా.. సొంత అజెండా అమ‌లు చేశారు. అదేస‌మ‌యంలో కేంద్రం అనుస‌రిస్తున్న చ‌ర్య‌ల‌తో ఇక్క‌డ ప‌వ‌న్ ఏమీ మాట్లాడ‌లేని ప‌రిస్తితిని తీసుకువ‌చ్చారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే ప‌వ‌న్‌.. బీజేపీకి దూర‌మ‌వుతున్నార‌నే వాద‌న ఉంది. ఈ క్ర‌మంలో ఇప్పుడు క‌నుక తాము ప‌వ‌న్‌ను ప్ర‌శ్నిస్తే.. త‌మ లోపాల‌నే బ‌య‌ట పెడ‌తార‌ని అందుకే బీజేపీ నేత‌లు సైలెంట్ అయ్యార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.