ప‌వ‌న్ విష‌యంలో బీజేపీది స్వ‌యంకృతమేనా?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. త‌మ‌తోనే ఉన్నాడ‌ని.. త‌మ రెండు పార్టీలూ పొత్తుతోనే ముందుకు వెళ్తున్నాయ‌ని.. బీజేపీ నేత‌లు ప‌దే ప‌దే చెప్పుకొంటున్న విష‌యం తెలిసిందే. అయితే.. గ‌త కొన్నాళ్లుగా ప‌వ‌న్ వ్య‌వ‌హారం.. మారుతున్నా.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారుతున్నాయ‌నే సంకేతాలు వ‌స్తున్నా… ఏమీ మాట్లాడ‌లేని.. ప‌న్నెత్తు మాట అన‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు? అంటే.. బీజేపీ చేసుకున్న స్వ‌యంకృత‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ప్ర‌స్తుతం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌.. బీజేపీతో పొత్తులో ఉన్నారు. ఇది పైకి క‌నిపిస్తున్న నిజం. 2020లోనే ఆయ‌న కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల‌తో పొత్తు కుదుర్చుకున్నారు. అప్ప‌టి నుంచి బీజేపీతో పొత్తులో ఉన్నాన‌ని.. ప‌వ‌న్ చెబుతున్నారు. ఢిల్లీ పెద్ద‌లు త‌ర‌చుగా ప‌వ‌న్‌ను వివిధ కార్య‌క్ర‌మాల‌కు కూడా ఆహ్వానిస్తున్నారు. ఇక‌, రాష్ట్రంలోనూ ప‌వ‌న్‌.. బీజేపీ రాష్ట్ర చీఫ్‌.. సోము వీర్రాజు త‌దిత‌రుల‌తో భేటీ అవుతున్నారు. ఉమ్మ‌డి కార్య‌క్ర‌మాల‌కు కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు ప‌వ‌న్ వ్యూహం మార్చుకున్నారు. పైకి ప్ర‌క‌టించ‌క‌పోయినా.. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. అవి ఎప్పుడు జ‌రిగినా.. టీడీపీతో క‌లిసి పోటీ చేస్తార‌నే ప్ర‌చారం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌గా మారింది.

ఇటు ఏపీలోనూ టీడీపీ.. జ‌న‌సేన‌ను దృష్టిలో ఉంచుకునే అడుగులు వేస్తోంది. వైసీపీని అధికారం నుంచి దింపాలంటే.. టీడీపీతో పొత్తుతో ఉంటే సాధ్యం కాదని.. ప‌వ‌న్ ద్రుఢంగా విశ్వ‌సిస్తున్నారు. అంతేకాదు.. మ‌రోవైపు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ కూడా ప‌వ‌న్‌తో జ‌ట్టు క‌డితేనే రాష్ట్రంలో మ‌ళ్లీ 2014 నాటి ప‌రిస్థితి రిపీట్ అవుతుంద‌ని.. భావిస్తోంది.. ప‌వ‌న్ కూడా టీడీపీతో జ‌ట్టు క‌ట్టేందుకు రెడీ అయ్యారు. దీనికి సంబంధించి అంత‌ర్గ‌త చ‌ర్చ‌లు కూడా ఇప్ప‌టికే పూర్త‌య్యాయ‌ని.. ఇక‌, ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌క‌టించ‌డ‌మే త‌రువాయి అని అంటున్నారు.

ఇదిలా ఉంటే, ఇప్ప‌టికే… స్థానిక ఎన్నిక‌ల్లో ప‌లు చోట్ల‌.. టీడీపీ-జ‌న‌సేన అభ్య‌ర్థులు క‌లిసి అధికారం పంచుకున్నారు. ఇవ‌న్నీ కూడా రాబోయే పోత్తుల‌కు మార్పుల‌కు సంకేతాలుగా క‌నిపిస్తున్నాయ‌ని రాజకీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. మ‌రి ఇంత జ‌రుగుతున్నా.. బీజేపీ నేత‌ల నుంచి ఎలాంటి కామెంట్లు ప‌డ‌డం లేదు. ప‌వ‌న్‌.. టీడీపీలో క‌లిసిపోతున్నార‌ని.. క‌లిసేందుకు రూట్ మ్యాప్ కూడా రెడీ చేసుకున్నార‌ని.. తెలిసినా.. బీజేపీ మౌనంగానే ఉంది. మ‌రి దీనికి రీజనేంటి?

పోనీ.. ప‌వ‌న్‌తో పాటు బీజేపీ కూడా టీడీపీతో క‌లిసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తుందా? అంటే.. అలా జ‌ర‌గ‌నే జ‌ర‌గ‌ద‌ని.. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు చెబుతున్నారు. అదేస‌మ‌యంలో రాష్ట్ర బీజేపీ నాయ‌కులు కూడా ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నారు. మ‌రి అలాంటి స‌మ‌యంలో త‌మ మిత్ర‌ప‌క్షంగా పైకి ఉంటూ.. లోపాయికారీగా టీడీపీతో పొత్తుకు ప‌వ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నా.. ఎందుకు సైలెంట్‌గా ఉన్నార‌నేది ప్ర‌శ్న‌.

దీనికి బీజేపీనే కార‌ణ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్పుడు క‌నుక బీజేపీ నోరు తెరిచి.. ప‌వ‌న్‌ను ప్ర‌శ్నిస్తే.. ఆయ‌న ఎదురు సంధించే ప్ర‌శ్న‌ల‌కు బీజేపీ స‌మాధానం చెప్పే ప‌రిస్థితి ఉండ‌ద‌ని అంటున్నారు. ఎందుకంటే.. పొత్తు ఉన్న‌ప్ప‌టికీ.. ప‌వ‌న్‌కు కానీ.. జ‌న‌సేనకు కానీ.. బీజేపీ ఎలాంటి విలువా ఇవ్వ‌లేదు. తిరుప‌తి ఉప ఎన్నిక‌లో త‌మ‌కు టికెట్ ఇవ్వాల‌ని.. ప‌వ‌న్ కేంద్రం పెద్ద‌ల వ‌ద్ద‌కు వెళ్లి పంచాయితీ పెట్టుకున్నా.. రాష్ట్ర బీజేపీ నేత‌లు.. ప‌వ‌న్‌ను ప‌క్క‌న పెట్టి.. టికెట్ తెచ్చుకున్నారు.

ఇక‌, స్థానిక ఎన్నిక‌ల్లోనూ ప‌వ‌న్‌తో క‌లిసి పోటీ చేయ‌కుండా.. సొంత అజెండా అమ‌లు చేశారు. ఇప్పుడు క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్‌లో ప‌వ‌న్ ఉప ఎన్నిక‌కు దూరంగా ఉన్నా బీజేపీ మాత్రం త‌గుదున‌మ్మా అంటూ.. పోటీ చేస్తోంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే ప‌వ‌న్‌.. బీజేపీకి దూర‌మ‌వుతున్నార‌నే వాద‌న ఉంది. దీంతో ఇప్పుడు క‌నుక తాము ప‌వ‌న్‌ను ప్ర‌శ్నిస్తే.. త‌మ లోపాల‌నే బ‌య‌ట పెడ‌తార‌ని.. ప‌వ‌న్ కు స్వేచ్ఛ లేకుండా చేసింది తామేన‌ని బీజేపీ వ‌ర్గాలు అంటున్నాయి. అందుకే ప‌వ‌న్ టీడీపీతో పొత్తుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలిసినా.. ఏమీ మాట్లాడ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌నేది బీజేపీ వ‌ర్గాలే గుస‌గుస‌లాడుతున్నాయి.