టీడీపీ బంద్.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తత

ఏపీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ నేతల, కార్యాలయాలపై మంగళవారం జరిగిన దాడులకు నిరసనగా ఆ పార్టీ నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో టీడీపీ నేతలు బంద్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ డిపోల ఎదుట బైఠాయించారు. టీడీపీ బంద్ నేపథ్యంలో జిల్లాలో ఎక్కడికక్కడ టీడీపీ ముఖ్య నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం నాలుగు మండలాల్లో టీడీపీ నాయకులను తెల్లవారుజాము నుంచే పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.

గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అటు మైలవరంలో కూడా భారీగా పోలీసులు మోహరించారు. మైలవరం, జి. కొండూరు, రెడ్డిగూడెం మండలాల్లో టీడీపీ నాయకులను ఇంట్లో నుంచి బయటకు రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. రోడ్లపైకి వచ్చే నాయకులను వెంటనే అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు.

శ్రీకాకుళం బస్సు స్టేషన్ వద్ద ఎంపీ రామ్మోహన్ నాయుడు బైఠాయించారు. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు టీడీపీ నేతలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో రామ్మోహన్ నాయుడు, పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగింది. టీడీపీ నేతల పట్ల గుంటూరు అర్బన్ పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించారు. బస్టాండ్ వద్ద నిరసన వ్యక్తం చేసిన టీడీపీ నేతలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. పార్శిల్ వ్యాన్‌లో టీడీపీ నేతలను కుక్కారు. వెనక డోర్ వేసి ఊపిరి ఆడకుండా చేశారని టీడీపీ నేతలు వాపోయారు.

మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంటి నుంచి బయటకు వస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. తనను అడ్డుకునే హక్కు పోలీసులకు లేదని ప్రభాకర్ చెప్పారు. దీంతో బయటకు వెళ్లేందుకు చింతమనేని విశ్వ ప్రయత్నం చేశారు. చివరకు పోలీసు వలయాన్ని చేధించుకుని ప్రభాకర్ మోటార్ బైక్‌పై బయటకు వెళ్లిపోయారు.

కుప్పంలో టీడీపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్‌ చేశారు. కుప్పం దగ్గర జాతీయ రహదారిపై టీడీపీ నేతలు ధర్నా నిర్వహించారు. కుప్పం బస్టాండ్‌కు బస్సులు రాకుండా అడ్డుకున్నారు. పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబు, రాష్ట్ర రైతు నాయకుడు పీఎస్ మనోహర్ నాయుడు, రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి వెన్నెలకంటి సురేంద్ర కుమార్‌ను హౌస్ అరెస్ట్ చేశారు.