ఆ టీడీపీ ఫ్యామిలీకి మూడు టిక్కెట్లా… ఒక్క‌టే ర‌చ్చ‌..!


క‌ర్నూలు జిల్లా టీడీపీలో టికెట్ల ర‌గ‌డ రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం కూడా చేరువ కాక‌పోయినా.. టికెట్ల కోసం.. నాయ‌కులు ఒక‌రి వెంట ఒక‌రు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అంతేకాదు.. మాకు రెండు కావాల‌ని ఒక‌రంటే.. మాకు మూడు కావాలంటూ.. చంద్ర‌బాబు వ‌ద్ద ఇండెంట్లు పెట్టేస్తున్నార‌ట‌. ఈ ప‌రిస్థితిని చూసి.. ఎవ‌రినీ నొప్పించ‌కుండా ఉండేందుకు .. చంద్ర‌బాబు త‌న‌దైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. అంటే.. ఎవ‌రికీ టికెట్లు కేటాయించ‌కుండా.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌క‌టిస్తామ‌నే సందేశాన్ని ఆయ‌న పంపేసిన‌ట్టు చెబుతున్నారు.

మ‌రీ ముఖ్యంగా దివంగ‌త భూమా నాగిరెడ్డి కుటుంబం .. గ‌త ఎన్నిక‌ల్లో రెండు స్థానాలు ద‌క్కించుకుంది. అయితే.. ఇప్పుడు ఏకంగా మూడు సీట్లు త‌మ‌కు ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్న‌ట్టు టీడీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. మాజీ మంత్రి, నాగిరెడ్డి కుమార్తె.. అఖిల ప్రియ‌.. ఆళ్ల‌గ‌డ్డ‌.. నంద్యాలతోపాటు.. శ్రీశైలం టికెట్‌ను కూడా త‌మ ఖాతాలోకే ప‌డేలా చ‌క్రం తిప్పుతున్నార‌ని అంటున్నారు. గ‌తంలో ఆళ్ల‌గ‌డ్డ నుంచి గెలిచిన అఖిల ప్రియ‌.. అనూహ్య ప‌రిస్థితుల్లో మంత్రిగా ప‌ద‌విని చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో నంద్యాల నుంచి పోటీ చేసిన‌.. నాగిరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో వ‌చ్చిన గ్యాప్‌తో ఈ కుటుంబానికే చెందిన భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు.

అయితే.. ఇప్పుడు.. నాగిరెడ్డి కుమారుడు జ‌గ‌త్‌విఖ్యాత్ రెడ్డి.. కూడా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. వ‌చ్చే ఎన్నిక ల్లో పోటీకి రెడీ అవుతున్నారు. అయితే.. టికెట్ విష‌యంలో చ‌ర్చ‌గా మారింది. త‌న తండ్రి పోటీ చేసిన స్థానం క‌నుక‌.. నంద్యాల‌ను త‌న సొద‌రుడు జ‌గ‌త్‌కు ఇప్పించుకునేందుకు అఖిల ప్ర‌య‌త్నిస్తున్నారు. దీంతో భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి ప‌రిస్థితి ఏంట‌నేది ప్ర‌శ్న‌గా మారింది. దీంతో కొన్నాళ్లుగా ఈ విష‌యంలో స్త‌బ్ద‌త ఏర్ప‌డింది. అయితే.. ఇది కుటుంబంలో చిచ్చుగా మారి.. అఖిల ప్రియ రాజ‌కీయాల‌కు ఇబ్బందిగా ప‌రిణిస్తోంద‌నే సంకేతాలు వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యంలో ఆమె శ్రీశైలం టికెట్‌ను బ్ర‌హ్మానంద‌రెడ్డికి ఇవ్వాల‌ని.. చంద్ర‌బాబుకు లేఖ రాసిన‌ట్టు.. ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే.. ఒక్క భూమా కుటుంబానికే ఇన్ని టికెట్లు మాకు కూడా కావాలంటూ.. కేఈ, కోట్ల కుటుంబాల నుంచి కూడా డిమాండ్లు పెరుగుతున్నాయ‌ట‌. మ‌రి చంద్ర‌బాబు ఈ విష‌యంలో ఎవ‌రినీ నొప్పించ‌కుండా.. చేసేందుకు టికెట్ల విష‌యాన్ని వాయిదా వేస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఏం జరుగుతుందో చూడాలి.