కరిగిపోతున్న మోడీ ఇమేజ్ ను కమలనాథులు గుర్తించారా?

ఒకప్పుడు బీజేపీ అన్నంతనే పలువురు నేతల పేర్లు వరుస పెట్టి చెప్పే వారు. కాంగ్రెస్ పార్టీ మాదిరి వ్యక్తి ఆధారిత పార్టీగా కాకుండా.. సిద్ధాంత బలంతో ప్రజల్లోకి వెళ్లే పార్టీగా పేరుండేది. అంతేకాదు.. ఒకరిద్దరి చుట్టూ ఆ పార్టీ తిరగదన్న మాట బలంగా వినిపించేది. మిగిలిన పార్టీలకు.. బీజేపీకి మధ్యనున్న వ్యత్యాసం ఇదేనన్న మాట వినిపించేది. కానీ.. ఇప్పుడు సీన్ మారిపోయింది. ఎప్పుడైతే జాతీయ స్థాయిలో పార్టీని మోడీ.. అమిత్ షాలు ప్రభావితం చేయటం షురూ చేశారో బీజేపీ లోపలి సీన్ మొత్తం మారిపోయింది.

గతానికి భిన్నంగా ఇప్పుడా పార్టీ వ్యక్తుల చుట్టూనే తిరగటం మొదలెట్టింది. వ్యక్తిపూజకు పెద్దపీట వేయడం తో పాటు.. గతంలో మాదిరి.. వివిధ అంశాల మీద భిన్నాభిప్రాయాల్ని స్పష్టంగా వెల్లడించే తీరు తగ్గిపోయింది. ఇప్పుడు బీజేపీ అన్నంతనే మోడీ.. అమిత్ షాలు మాత్రమే గుర్తుకు వచ్చే పరిస్థితి. మిగిలిన సీనియర్లను లెక్కలోకి కూడా తీసుకునే పరిస్థితి లేదు. అయితే.. కమలనాథులు ఇలాంటి పరిస్థితిని ఎందుకు ఓకే చేస్తున్నారంటే దీనికి కారణం.. విజయం సాధించటమే. మోడీ బొమ్మను చూపిస్తే చాలు.. విజయం దానంతట అదే వచ్చేస్తుందన్న భావనతో..తనకు అలవాటు లేని సరికొత్త దారిలో బీజేపీ నడిచింది.

ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో మోడీ ఇమేజ్ కు దెబ్బ పడిందని.. అంతలా స్పందన లేదని.. ఆయన సర్కారు అనుసరిస్తున్న విధానాలు.. అమలు చేస్తున్న పద్దతలు పార్టీ ఇమేజ్ ను.. ఆయన ఇమేజ్ ను దెబ్బ తీసేలా ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇలాంటి వేళ..కేంద్ర సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్న ఇంద్రజిత్ సింగ్ అనే పెద్ద మనిషి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ పేరు చెప్పుకొని ఎన్నికల్లో పోటీ చేస్తే కష్టమే అన్న విషయాన్ని కుండ బద్ధలు కొట్టేశారు.

హర్యానాలో జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయన నోటినుంచి ఈ వ్యాఖ్యలు రావటం గమనార్హం. హర్యానా.. పంజాబ్ లో రైతు వ్యతిరేక చట్టాల్ని తీసుకొచ్చింది మోడీనే అన్న భావన బలంగా ఉంది. ఇలాంటివేళ.. రెండుసార్లు అధికారాన్ని సొంతం చేసుకున్న బీజేపీ.. మూడోసారి గెలవాలంటే మోడీ పేరును ప్రస్తావించకూడదన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. ఒకవేళ.. మోడీని నమ్ముకొని బరిలోకి దిగితే 45 సీట్లు కూడా గెలవగలమా? అన్న సందేహం ఆయన నోటి నుంచి వచ్చింది. కార్యకర్తలు కష్టపడితేనే పార్టీకి విజయమన్న ఆయన మాట ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి మీద ప్రధాని మోడీ ఎలా రియాక్టు అవుతారో?