బీజేపీ అభ్యర్థికి ఒక్కటంటే ఒక్క ఓటే


భారతీయ జనతా పార్టీ.. ఏడేళ్ల నుంచి భారత దేశాన్ని పాలిస్తున్న పార్టీ. దాని బలం ముందు ఇండియాలో ఏ పార్టీ కూడా నిలవలేకపోతోంది. 2014-19 మధ్య పెద్ద తప్పులు చేసినా.. ఆ తప్పుల్ని మన్నించి మళ్లీ ఆ పార్టీకే అధికారం అధికారం కట్టబెట్టారు దేశ ప్రజలు. అలాంటి పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థికి కేవలం ఒక్క ఓటు వచ్చిందంటే నమ్మశక్యంగా అనిపించదు. ఏ రాష్ట్రమైనా కావచ్చు.. ఎన్నిక ఎలాంటిదైనా కావచ్చు.. మరీ బీజేపీ అభ్యర్థికి ఒక్కటంటే ఒక్క ఓటు రావడం మాత్రం అనూహ్యమే. ఈ సంచలనం తమిళనాడులో చోటు చేసుకుంది.

ఆ రాష్ట్రంలో బీజేపీ బలం అంతంతమాత్రమే అన్న సంగతి తెలిసిందే. ఐదేళ్ల కిందట జయలలిత మరణానంతరం అధికార అన్నాడీఎంకేను గుప్పెట్లో పెట్టుకుని బలం పెంచుకోవడానికి బీజేపీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఏం చేసినా కమలం పార్టీ బలపడలేదు. అతి కష్టం మీద 4 సీట్లు సాధించగలిగింది.

ఆ ఫలితమైనా నయమే కానీ.. ప్రస్తుత స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక స్థానంలో దారుణమైన అనుభవం ఎదురైంది. కోయంబత్తూరు జిల్లాలోని పెరియనాయకన్ పాలెంలో వార్డు మెంబరుగా బీజేపీ తరఫున పోటీ చేసిన కార్తీక్‌కు కేవలం ఒక్కటంటే ఒక్క ఓటు మాత్రమే పడింది. బహుశా అది ఆయనకు ఆయన వేసుకున్న ఓటు కావచ్చు. కార్తీక్ కుటుంబంలో ఇంకో నలుగురు ఓటర్లుండగా.. ఆ నలుగురు కూడా కార్తీక్‌కు ఓటు వేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.

ఏ స్థాయి ఎన్నిక అయినా సరే.. ఒక ప్రముఖ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థికి కేవలం ఒక్క ఓటు మాత్రమే పడ్డ సందర్భం ఇంతకుముందు ఎప్పుడూ జరిగి ఉండకపోవచ్చు. బీజేపీ మీద జనాల్లో ఉన్న ఆగ్రహానికి సూచిక ఇదంటూ ప్రత్యర్థి పార్టీల జనాలు సోషల్ మీడియాలో ఈ వార్తను వైరల్ చేసి మోడీ సర్కారు పరువు తీసే పనిలో పడ్డారు.