పోగొట్టుకున్న చోటే వెతుకుంటున్న చంద్రబాబు

ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతికితే ప్రయోజనం ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. చంద్రబాబు ఇప్పుడు అదే పనిలో బిజీగా ఉన్నారు. అందులో ఆయన విజయం సాధిస్తారో లేక ఆశాభంగానికి గురవుతారో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి పెట్టని కోట. గుండ్లకుంట శివారెడ్డి మరణం తర్వాత టీడీపీ ప్రాభవం కోల్పోయింది. శివారెడ్డి వారసత్వాన్ని రామసుబ్బారెడ్డి అందుకున్నారు. జమ్మలమడుగు నుంచి రామసుబ్బారెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత రామసుబ్బారెడ్డిపై దేవగుడి ఆదినారాయణరెడ్డి మూడు సార్లు విజయం సాధించారు.

ఈ క్రమంలోనే టీడీపీ మనుగడే నియోజకవర్గంలో ప్రశ్నార్థకమైంది. దేవగుడి, రామసుబ్బారెడ్డి కుటుంబాల మధ్య కొన్ని దశాబ్ధాలుగా వైరం నడించింది. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి ఆదినారాయణరెడ్డి ఎమ్మెల్యే ఎన్నికయ్యారు. అనుకోని పరిణామాల నేపథ్యంలో ఆయన టీడీపీ గూటికి చేరారు. అందుకు ప్రతిఫలంగా ఆదినారాయణరెడ్డికి చంద్రబాబు మంత్రి పదవి కట్టబెట్టారు. ఆదినారాయణరెడ్డి, టీడీపీలో చేరడాన్ని రామసుబ్బారెడ్డి, ఆయన అనుచరులు తీవ్రంగా వ్యతిరేకించారు. రామసుబ్బారెడ్డిని శాంతిపజేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు కూడా.

2019 ఎన్నికల్లో తిరిగి జమ్మలమడుగు నుంచి టీడీపీ తరపున రామసుబ్బారెడ్డి బరిలో దిగారు. ఆయన సమీప అభ్యర్థి సుధీర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక టీడీపీలో ఉంటే లాభం లేదని రామసుబ్బారెడ్డి అనుకున్నారో ఏమో వైసీపీలో చేరారు. ఆదినారాయణ రెడ్డి కూడా బీజేపీలో చేరారు. ఇక్కడి నుంచే టీడీపీ అసలు కష్టాలు మొదలయ్యాయి. జమ్మలమడుగు నియోజకవర్గానికి ఇన్‌ఛార్జ్ కరువయ్యారు. నియోజకవర్గంలో పెద్దదిక్కు లేకుంటే పార్టీకి నష్టమని అధినేత భావించి.. పులివెందులకు చెందిన బీటెక్ రవిని నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా నిమయించారు. ఆయన స్థానికేతరుడు కాబట్టి.. స్థానిక నేతనే ఇన్‌ఛార్జ్‌గా నియమించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారని పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇక్కడే అసలు విషయం ఉంది. ఏ కుటుంబం వల్ల నియోజకవర్గంలో టీడీపీకి తీరని నష్టం జరిగిందే ఆ కుటుంబానికి చెందిన వ్యక్తినే జమ్మలమడుగు ఇన్‌ఛార్జ్‌గా నియమించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారంట. ఇటీవల జమ్మలమడుగుకు చెందిన టీడీపీ నేత జంబాపురం రమణారెడ్డి, కుటుంబ సభ్యులతో సహా చంద్రబాబును కలిశారు. జమ్మలమడుగులో పార్టీ పరిస్థితి, బలోపేతం, కొత్త ఇన్‌ఛార్జ్ నియామకంపై చర్చించారు. ఈ చర్చలో జమ్మలమడుగు ఇన్‌ఛార్జ్‌గా దేవగుడి నారాయణరెడ్డి కుమారుడు భూపేశ్‌రెడ్డిని నియమించాలనే ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు రమణారెడ్డి కుటుంబం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

దేవగుడి, రమణారెడ్డి కుటుంబాల మధ్య కూడా రాజకీయ వైరం ఉంది. ఇరు కుటుంబాలు కలిసికట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని చంద్రబాబు సూచించారని చెబుతున్నారు. పార్టీలో రమణారెడ్డి కుటుంబానికి సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు హామీ కూడా ఇచ్చారని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో భూపేశ్‌రెడ్డిని తప్పకుండా గెలిపిస్తామని రమణారెడ్డి కూడా చంద్రబాబుకు హామీ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. త్వరలో అధికారికంగా భూషేశ్‌రెడ్డిని జమ్మలమడుగు టీడీపీ ఇన్‌ఛార్జీగా నియమిస్తారని చెబుతున్నారు. రమణారెడ్డి, దేవగుడి కుటుంబాలు కలిసిమెలసి పనిచేస్తాయో లేక కయ్యానికి కాలు దువ్వుతారో కాలమే నిర్ణయించాలి.