రాంగ్ రూట్‌లో కేటీఆర్ వాహనం ఆపేసిన ట్రాఫిక్ పోలీసులు

సాదారణంగా మనం యూటర్న్ దూరంగా ఉంటేనో.. లేక తొందరగా పోవాలనో తప్పు అని తెలిసినా కొన్ని సందర్భాల్లో వాహనంపై రాంగ్‌‌రూట్‌లో వెళ్తుంటాం. ఆ సమయానికి అక్కడ ట్రాఫిక్ పోలీసులుంటే.. ఒకవేళ పట్టుబడితే మన వాహన చిట్టాను విప్పుతారు. చలానాలు పెండింగ్‌లో ఉన్నాయంటే చాలు.. పోలీసులు నిర్దాక్షిణ్యంగా సీజ్‌ చేసేస్తారు. ఎంత వేడుకున్నా ఊరుకోరు. మనకు కాస్త పలుకుబడి ఉందనుకో అప్పటికి సులభంగా బయటపడొచ్చు. అదే పలుకుబడి లేని కాస్త అమాయకంగా కనిపించిన వాహనదారులకు పోలీసు చుక్కలు చూపిస్తారు.

అదేమంటే.. రూల్స్‌ అంటారు. అదే ఎమ్మెల్యే వాహనం రాంగ్ రూట్ పోతుంటే.. ట్రాఫిక్ పోలీసులు సెల్యూట్ కొట్టి మరీ సాగనంపుతారు… అదేమంటే అది ఎమ్మెల్యే కారు.. ఏదో ముఖ్యమైన పని కోసం పోతున్నారని సావదానంగా సమాధామిస్తారు. అదే మంత్రి కాన్వాయ్ రాంగ్‌‌ రూట్‌లో వెళ్తుంటే ఆపరుగాక ఆపరు అని మీరు అనుకోవచ్చు. అయితే మంత్రి అయినా సరే.. అందరికీ ఒకే రూల్.. అని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఏకంగా మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌లోని ఓ వాహనాన్ని అడ్డుకుని శభాష్ అనిపించుకున్నారు.

ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా లంగర్‌హౌస్‌లోని బాపూ ఘాట్ వద్ద ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. పలువురు బాపు ఘాట్ వద్ద మహాత్ముడికి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, గవర్నర్‌తో పాటు ప్రముఖులు బాపూ ఘాట్‌కు నివాళులు అర్పిస్తున్న నేపథ్యంలో ప్రముఖులు ట్రాఫిక్‌లో చిక్కకుపోకుండా పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. స్పెషన్ డ్రైవ్ నిర్వహించిన నిబంధలను ఉల్లఘించిన వాహనాదారులకు ఫైన్ చేశారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా బాపూ ఘాట్‌లో నివాళి అర్పించడానికి వచ్చారు. అయితే గవర్నర్ కాన్వాయ్‌కి అడ్డు తగలకుండా కేటీఆర్ కాన్వాయ్‌లోని ఓ వాహనం రాంగ్ రూట్‌లో వెళ్లింది. దీన్ని గమనించిన ట్రాఫిక్ పోలీస్ అధికారి ఐలయ్య వాహనాన్ని ఆపేశారు. దీంతో టీఆర్‌ఎస్ నేతలు పోలీస్ అధికారిపై మండిపడ్డారు. ట్రాఫిక్ పోలీసులతో గొడవకు దిగారు. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ వాహనంలో కేటీఆర్ లేకపోవడం గమనార్హం.

ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీఆర్‌ఎస్ కార్యకర్తలను నెటిజన్లు తప్పుబడుతున్నారు. కేటీఆర్‌కు ఓ రూల్, సామాన్యుడికి ఒక రూలా? అని ప్రశ్నిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసుల ధైర్య సాహాసాలను ప్రశంసిస్తున్నారు. నిత్యం సోషల్ మీడియాతో యాక్టివ్‌గా ఉండే కేటీఆర్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడ గమనార్హం. ప్రస్తుతం ఈ తతంగంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది.