రేవంత్ కు కాంగ్రెస్ మార్కు ట్రీట్మెంట్ ?

కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడేమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఉదయం హీరోగా ఉన్న నేత మధ్యాహ్నానికి జీరో అయిపోతారు. ఇపుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరిస్థితి దాదాపు అదే లాగా తయారైందట. పీసీసీ పగ్గాలు చేతికి అందిన దగ్గర నుండి పార్టీ క్యాడర్లో మంచి ఉత్సాహాన్నే తెచ్చారు. అప్పటివరకు స్తబ్దుగా ఉన్నా చాలామంది నేతలు, క్యాడర్లో ఒక్కసారిగా జోష్ పెరిగింది. డైరెక్ట్ గా కేసీయార్+కేటీయార్ ను ఎటాక్ చేస్తుండటం, ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలతో చెలరేగిపోతున్నారు.

దీనికి అదనంగా రకరకాలుగా జనాల్లోనే ఉండటానికి దళిత, గిరిజన దండోరా లాంటి ఏదో ఓ ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నారు రేవంత్. దీంతో నేతల సంగతి ఎలా ఉన్నా క్యాడర్లో మాత్రం మంచి ఉత్సాహం కనిపిస్తుంది. మంచి జోరుమీదున్న రేవంత్ స్పీడుకు అధిష్టానం ఒక్కసారిగా బ్రేకులు వేసేసింది. దీన్ని రేవంత్ ఏ మాత్రం ఊహించి ఉండరు. ఇంతకీ రేవంత్ జోరుకు అధిష్టానం ఏ విధంగా బ్రేకులు వేసిందంటే పార్టీలో రాజకీయ వ్యవహారాల కమిటీ (పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ)ని ఏర్పాటు చేసింది.

గతంలో ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి కమిటి లేదు. ఇపుడీ కమిటిని ఎందుకు వేసిందంటే పార్టీ తరపున నిర్వహిస్తున్న ఎలాంటి కార్యక్రమమైనా ముందుగా పీఏసీ ఆమోదించాలి. అంటే పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటానని, అమలు చేస్తానని అంటే ఇకనుండి సాధ్యం కాదని రేవంత్ కు అర్ధమైపోయుంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే రేవంత్ ను నూరుశాతం వ్యతిరేకిస్తున్న నేతలను ఇందులో నియమించటం.

ఈ కమిటికి రాష్ట్ర కాంగ్రెస్ పరిశీలకుడు మాణిక్యం ఠాకూర్ చైర్మన్. కన్వీనర్ గా మాజీ మంత్రి షబ్బీర్ ఆలీని నియమించింది. సభ్యులుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీహెచ్ లాంటి వాళ్ళని నియమించింది. రేవంత్ కూడా ఇందులో సభ్యుడు మాత్రమే. పీఏసీ ఏర్పాటుతోనే రేవంత్ కు తానేమిటో అధిష్టానం తెలియజెప్పింది. పార్టీలో ఎప్పుడూ ఇలాగే జరుగుతుంటుంది. పూర్తి పగ్గాలు ఇచ్చినట్లే ఇచ్చి అధిష్టానం మళ్ళీ స్టీరింగ్ తానే తీసేసుకుంటుందని గతంలో కూడా చాలాసార్లు రుజువైంది.