జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ ?

దేశవ్యాప్తంగా జనాలు ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్నట్లుగా పెట్రోల్, డీజల్ ను కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిధిలోకి తెస్తుందా ? అవకాశాలు ఉన్నాయనే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో వచ్చే శుక్రవారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగబోతోంది. ఆ సమావేశంలో చర్చించబోయే అజెండాలో వివిధ అంశాల్లో పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చే అంశం కూడా ఉందని సమాచారం. మనదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు చాలా ఎక్కువగా ఉన్న విషయం జనాలందరికీ తెలిసిందే.

యూపీఏ హయాంలో ఉన్న దాని కన్నా నరేంద్ర మోడీ సర్కార్ హయాంలో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ బ్యారల్ ధరలపైన ఆధారపడి మనదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆధారపడుంటాయి. క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయస్ధాయిలో తగ్గినా మన దగ్గర మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం లేదు. పైగా క్రూడాయిల్ తో ఎలాంటి సంబంధం లేకుండానే వీటి ధరలు పెరిగిపోతున్నాయి.

క్రూడాయిల్ ధరలు దామాషాతో తగ్గాల్సిన ధరలు రివర్సులో పెరుగుతుండటంతో జనాలు ప్రభుత్వంపై బాగా మండిపోతున్నారు. యూపీఏ హయాంలో 60 రూపాయలు పెట్రోల్ ధర ఉన్నపుడే అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోడీతో సహా ఇప్పటి కేంద్ర మంత్రులు చాలామంది నానా గోల చేశారు. మరిప్పుడు మోడీ ప్రధామంత్రి అయిన తర్వాత ఇదే పెట్రోల్, డీజల్ ధరలు లీటర్ 100 రూపాయలు దాటిపోయింది. ఇదే విషయాన్ని జనాలు ఎంత ప్రశ్నిస్తున్నా కేంద్రం ఎవరినీ లెక్క చేయడం లేదు.

నిజంగానే పెట్రోల్, డీజిల్ ను కనుక జీఎస్టీ పరిధిలోకి తీసుకు వస్తే వాటి ధరలు సగానికి సగం తగ్గిపోతాయని నిపుణులు ఎప్పటినుండో చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో కేంద్రం, రాష్ట్రం విధిస్తున్న అనేక పన్నులు కలిసున్నాయి. ఈ పనులన్నింటినీ తగ్గించేస్తే పెట్రోల్, డీజిల్ ధరలు సుమారు 60 రూపాయలకు దిగొచ్చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్రం విధించే పన్నులు+వ్యాట్ కలిసి జీఎస్టీ పరిధిలోకి వచ్చిన తర్వాత అన్ని పన్నులు కలిపి 28 శాతానికి మించదు.

ఇపుడు లీటర్ పెట్రోల్ పై కేంద్రం పన్ను రు. 32.80, లీటర్ డీజిల్ పై రు. 31.80 ఉంది. వీటికి రాష్ట్రాలు అదనంగా విధించే వ్యాట్ అదనంగా ఉంటోంది. అన్నీ కలిపి లీటరు ధర 100 రూపాయలు దాటిపోయింది. ఇపుడు పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే పెట్రోల్, డీజల్ లీటర్ ధర సుమారు రు. 50-60 మధ్యకు దిగే అవకాశం ఉందంటున్నారు. మరి జనాలు కోరుకుంటున్నట్లు నరేంద్ర మోడీ సర్కార్ జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తుందా ?